యాప్నగరం

ఎమ్మెల్యేల అనర్హత కేసు: దినకరన్ వర్గానికి హైకోర్టు షాక్

తన వర్గం ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మద్రాసు హైకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు రోజుల కిందట దినకరన్ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు.

Samayam Telugu 25 Oct 2018, 11:45 am
అన్నాడీఎంకేకు చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్ధించింది. దీంతో మద్రాసు హైకోర్టు తీర్పుపై ఆశలు పెట్టుకున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు షాక్ తగలింది. మరోవైపు మద్రాసు హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలను రెండు రోజుల కిందటే రిసార్టుకు తరలించారు. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించిన దినకరన్ క్యాంపు రాజకీయాలకు మరోసారి తెరతీశారు. అయితే హైకోర్టు ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని, దీంతో పళని ప్రభుత్వం కుప్పకూలుతుందని దినకరన్ భావించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ ఈ సమావేశంలో సాగింది.
Samayam Telugu TTV-Dinakaran


అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో 235 మంది ఎమ్మెల్యేలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది సభ్యులు అవసరం. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉండటంతో 116 మంది బొటాబొటి మెజారిటీతో అన్నాడీఎంకే నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో మరో 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడంతో వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో వారంతా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాజా తీర్పుతో పళనిస్వామి ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చుంటే, పళని సర్కారు మైనారిటీలో పడిపోయేది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో పళని విఫలమైతే, ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.