యాప్నగరం

తమిళనాడు ఎన్నికలు.. ఎన్‌డీఏ సీఎం అభ్యర్థిపై అన్నాడీఎంకేకు బీజేపీ షాక్

జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తనకు అనుకూలంగా మలచుకుని, పళనిస్వామి సర్కారును తన కనుసన్నల్లోనే ఉంచుకుందని ప్రచారం జరుగుతోంది.

Samayam Telugu 25 Dec 2020, 2:04 pm
వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని అధికార అన్నాడీఎంకే, బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే, బీజేపీ- అన్నాడీఎంకేల మధ్య ‘సీఎం అభ్యర్థిత్వం’ చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఎన్‌డీఏ సీఎం అభ్యర్ధి విషయంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ మళ్లీ ప్రకటించడంతో కలకలం రేగుతోంది.
Samayam Telugu అన్నాడీఎంకే-బీజేపీ
The AIADMK and the BJP


గతవారం ఆయన ఇలాంటి ప్రకటన చేయడంతో మీ దారి మీరు చూసుకోండని అన్నాడీఎంకే కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఆయన తన ప్రకటనపై వెనక్కు తగ్గారు. కానీ, తాజాగా మదురై విమానాశ్రయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ ఆ ప్రకటనే చేశారు. ఇటీవల మురుగన్‌ ఇదే విధంగా వ్యాఖ్యానించడంతో అన్నాడీఎంకే నేతలు, సీనియర్‌ మంత్రులంతా ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి పళనిస్వామి పేరును నాయకులంతా ఏకగ్రీవంగా ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో మురుగన్ తన ప్రకటను సవరించుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

వ్యవహారం ముగిసిన నాలుగు రోజుల్లో మరోమారు నోరుజారి వివాదానికి తెరలేపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన వ్యవసాయ బిల్లులపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున వెయ్యి చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు మురుగన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో డీఎంకే సమ్మె పిలుపు విజయవంతం కాలేదని, డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 42 మంది రైతులపై కాల్పులు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

తమ కూటమి సీఎం అభ్యర్థిని తమ పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటిస్తుందని, జాతీయ కమిటీయే దానిని నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది కేవలం అన్నాడీఎంకే మాత్రమేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తమ కూటమిలో ఎలాంటి మార్పులుండబోవని, అయితే కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారు, ఎవరు ముఖ్యమంత్రి అన్నది తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.