యాప్నగరం

పన్నీరు దారెటు? శశికళ వ్యూహాలేంటి?

తమిళనాట రాజకీయం నాటకీయ మలుపులు తిరిగిన నేపథ్యంలో ఇప్పుడు పన్నీరు సెల్వం ముందున్న దారేది? శశికళ ఏ వ్యూహాలను అనుసరించనున్నారు.

TNN 8 Feb 2017, 8:35 am
పన్నీరు సెల్వం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో లేడీ చాణక్యగా పేరొందిన శశికళ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తిరుగుబావుటా ఎగరేసిన పన్నీరు సెల్వం వెనుక డీఎంకే నేతలు ఉన్నారని, కేంద్రంలోని అధికార బీజేపీ మద్దతుతోనే ఆయన ఇలా చేస్తున్నారంటూ ఇప్పటికే అన్నాడీఎంకే వర్గాలు పన్నీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీరు సెల్వాన్ని ఇప్పటికే తప్పించిన శశికళ.. ఇక పార్టీ నుంచి కూడా ఆయన బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎమ్మెల్యేలందరూ తనకే మద్దతు పలుకుతున్నారని ఆమె ఇప్పటికే వ్యాఖ్యానించారు. పన్నీరు తిరుగుబాటు నేపథ్యంలో పోయెస్ గార్డెన్స్‌లో బుధవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇది ఓ రకంగా బలప్రదర్శనగానే భావించవచ్చు. అంతేకాకుండా.. పార్టీలోని రెబల్స్ విషయం గురించి ఆమె ఆరా తీస్తున్నారు.
Samayam Telugu tamilnadu politics what are the options before pannerselvam and what sasikala is doing
పన్నీరు దారెటు? శశికళ వ్యూహాలేంటి?


మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకూ పోయె్‌సగార్డెన్‌లో సీనియర్‌ నేతలు, మంత్రులతో మంతనాలు జరిపిన శశికళ.. పన్నీరు సెల్వాన్ని పార్టీ కోశాధికారి పదవి నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. మరో ఒకట్రెండు రోజుల్లో ఆమె ఈ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోగా పన్నీర్‌సెల్వంపై ఎదురుదాడి చేయాలని, ఆయన విమర్శలను తిప్పికొట్టాలని తన అనుచరులకు ఆమె ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పలువురు నేతలు పన్నీర్‌సెల్వంపై విమర్శలు కురిపించారు. జయ మరణానంతరం ఆయన్ను సీఎం పీఠంపై కూర్చోబెడితే, అందుకు కృతజ్ఞతగా ఆయన చిన్నమ్మనే ధిక్కరించారంటూ పలువురు సీనియర్లు పన్నీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.


మరోవైపు పన్నీరు సెల్వం కూడా తన రాజీనామాను ఉపసహరించుకునే అవకాశం ఉంది. జయ మేనకోడలు దీప కూడా ఆయనకు మద్దతునిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విపక్ష డీఎంకే నేత స్టాలిన్ పన్నీరు ముఖ్యమంత్రిగా సాగడం పట్ల సానుకూలంగా ఉన్నారు. ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్రం మద్దతు కూడబెట్టేందుకు ఆయన ప్రయత్నించనున్నారు. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వంను కొందరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అభినందిస్తున్నారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఫోన్ చేశారని, తామంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు తెలుస్తోంది. చిన్నమ్మకు వ్యతిరేకంగా స్వరం వినిపించడంతో.. ఆమె అంటే గిట్టని వారు పన్నీరుకు మద్దతునిస్తున్నారు.

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 135 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు ఉన్నారు. వీరిలో 80 మందికిపైగా శశికళకు మద్దతు పలుకుతుండగా.. 50 మంది మాత్రం పన్నీరు వెంట నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తోన్న కేంద్రం తమిళనాడు పాలనను గవర్నర్ ద్వారా తన చేతుల్లోకి తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే జరిగితే తమిళనాట గవర్నరే సుప్రీం కానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.