యాప్నగరం

పార్టీ నుంచి నన్ను తప్పించలేరు : తేజ్‌ ప్రతాప్‌

బలరాముడు, శ్రీకృష్ణుడు లాంటి తమ సోదరుల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీతో పాటు ఆరెస్సెస్ యత్నిస్తోందని ఆరోపించారు.

Samayam Telugu 14 Sep 2018, 12:58 pm
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ కుటుంబంలో రాజకీయాల పరంగా విభేదాలు చోటుచేసుకున్నాయన్న వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో అర్జేడీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మంగళవారం బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన సమావేశానికి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ హాజరు కాకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. అయితే తమ కుటుంబంపై వస్తున్న వదంతులను లాలూ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఖండించారు.
Samayam Telugu Tej Pratap Yadav And Tejashwi


తేజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పార్టీ సమావేశమైన రోజు కాస్త అనారోగ్యంతో ఉన్న కారణంగా తాను హాజరు కాలేదని తెలిపారు. మథుర పర్యటనకు వెళ్లగా అనారోగ్యానికి గురయ్యానని చెప్పారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నంతకాలం తనను ఆర్జేడీ పార్టీ నుంచి ఎవరు తొలగించలేరని ధీమా వ్యక్తం చేశారు. బలరాముడు, శ్రీకృష్ణుడు లాంటి తమ సోదరుల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీతో పాటు ఆరెస్సెస్ యత్నిస్తోందని ఆరోపించారు.

పార్టీ పరంగా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయని అంతిమంగా అర్జేడీకి అధికారం కట్టబెట్టడమే తమ లక్ష్యమన్నారు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఎంతో మంది రాక్షసులను అంతం చేశాడన్న తేజ్ ప్రతాప్.. తన తమ్ముడు తేజస్వీ చేతిలో రాజకీయ ప్రత్యర్థులకు పరాభవం తప్పదని హెచ్చరించారు. బిహార్ 1970 దశకంలో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఉద్యమాన్ని చూసిందని, ప్రస్తుతం లాలూ ప్రసాద్ పాలన మార్గదర్శకంగా మారిందని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.