యాప్నగరం

భారత్ వైఖరి ఇది.. డియర్ పాక్ ఇది చాలా? ఇంకేమైనా కావాలా?

సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపనుందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టారు.

Samayam Telugu 28 Nov 2018, 1:32 pm
సార్క్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ ఆహ్వానించనుందనే వార్త మంగళవారం ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ కూడా పాక్ వెళ్తారనే ప్రచారం మొదలైంది. కానీ అలాంటిదేం లేదని భారత్ స్పష్టం చేసింది. సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని మోదీ పాకిస్థాన్ వెళ్లబోరని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాక్ సహకారం నిలిపి వేసేంత వరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
Samayam Telugu sushma-swaraj


కర్తార్‌పూర్ కారిడార్ విషయమై భారత్ ఎన్నో ఏళ్లుగా పాక్‌ను కోరుతోంది. ఆ దేశం ఇన్నాళ్లకు సానుకూలంగా స్పందించింది. ఈ కారణంతో ద్వైపాక్షిక చర్చలు తిరిగి ప్రారంభించలేమని సుష్మా తెలిపారు. ఉగ్రవాదం, చర్చలు.. రెండింటిని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని ఆమె చెప్పారు.

ఈ ఏడాది చివర్లో జరగనున్న సార్క్ సదస్సు కోసం మోదీని ఆహ్వానిస్తామని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మంగళవారం వెల్లడించారు. 2016లో సార్క్ సదస్సు ఇస్లామాబాద్‌లో నిర్వహించాలని భావించారు. కానీ యూరీ ఆర్మీ క్యాంప్‌‌పై అదే ఏడాది సెప్టెంబర్లో ఉగ్రవాదులు దాడి చేసి భారత సైనికులపై కాల్పులు జరిపారు. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ సార్క్ సదస్సును బహిష్కరించింది. భూటాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ కూడా సార్క్ సదస్సులో పాల్గొనడానికి విముఖత చూపాయి. దీంతో ఆ సదస్సు రద్దయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.