యాప్నగరం

కశ్మీర్ ఉగ్రదాడి.. ఆర్మీ అధికారి కుమార్తె మృతి

జమ్మూ కశ్మీర్‌లో సుంజ్వాన్ ఆర్మీ స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు శనివారం ఉదయం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

TNN 10 Feb 2018, 10:49 am
జమ్మూ కశ్మీర్‌లో సుంజ్వాన్ ఆర్మీ స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు శనివారం ఉదయం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. సంజ్వాన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారి కుమార్తె హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు సైనికులు గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున 4.55 గంటల ప్రాంతంలో 36 ఆర్మీ బ్రిగేడ్ క్యాంప్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాదులు బాంబులతో దాడిచేసి, కాల్పులకు తెగబడ్డారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఓ భవనంలో దాగి ఉన్నట్లు సమాచారం. జేసీఓ క్వార్టర్స్ సమీపంలోని సంత్రి బంకర్ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమై ఉగ్రవాదులపై కాల్పులు జరిపిందని జమ్మూ ఐజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. తీవ్రవాదుల దాడిలో గాయపడిన జవాన్లను వైద్యం కోసం మిలటరీ హాస్పిటల్‌లో చేర్పించినట్లు ఆయన వెల్లడించారు.
Samayam Telugu terrorists attack army camp in jammus sunjwan atleast four injured
కశ్మీర్ ఉగ్రదాడి.. ఆర్మీ అధికారి కుమార్తె మృతి


ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదుల పాల్గొన్నట్లు ఐజీ తెలియజేశారు. మరోవైపు సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల పాఠశాలలను మూసివేశారు. ఘటనాస్థలికి 500 మీటర్లలోపు పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఉగ్రవాదులతో పోరాటానికి అదనపు బలగాలను రప్పించారు. సుంజ్వాన్ చేరుకున్న ఆర్మీ ప్రత్యేక దళాలు, ఎస్ఓసీ సైన్యం ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఉగ్రదాడిపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ జమ్మూ కశ్మీర్ డీజీపీతో మాట్లాడి, హోమ్ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటుపై దాడికేసులో కీలక సూత్రధారి ఆఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9 న ఉరితీశారు... ఆ ఉగ్రవాది వర్దంతి సందర్భంగా జైషే మహ్మద్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయి. ఉగ్రదాడితో జమ్మూ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు.

గత శనివారం కూడా పుల్వామా జిల్లా ట్రాల్ సెక్టార్ సమీపంలోని బాటగండ్ గ్రామంలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడి జరగడానికి ఒక్కరోజు ముందే పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారం వ్యవధిలో తీవ్రవాదులు దాడికి తెగబడటం ఇది రెండోసారి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.