యాప్నగరం

పుల్వామాలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి

పాక్ సైన్యం కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులై 24 గంటలు గడవకముందే కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు.

TNN 6 Feb 2018, 8:26 am
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి సైన్యంపై దాడికి పాల్పడ్డారు. పుల్వామాలోని కాక్‌పోరా ప్రాంతంలో సైనిక స్థావరంపై సోమవారం రాత్రి గ్రనేడ్లు విసిరి దాడిచేసిన ఉగ్రవాదులు, అనంతరం కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడితో అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురు కాల్పులు ఆరంభించాయి. కాక్‌పోరాలోని రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదుల దాడిని సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో ముష్కరులు పరారయ్యారు. వారికోసం జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రాజౌరీ జిల్లా భింబేర్ గలి సెక్టార్‌లోని ఇండియన్ ఆర్మీ స్థావరంపై పాక్ సైన్యం కాల్పుల్లో ఓ అధికారితోసహా నలుగురు జవాన్లు అమరులై 24 గంటల గడవకముందే ఉగ్రదాడి చోటుచేసుకోవడం గమనార్హం.
Samayam Telugu terrorists attack indian army camp in jammu and kashmirs pulwama
పుల్వామాలో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి


దీంతో ఇక ఉపేక్షిస్తే లాభంలేదని, హద్దుల మీరుతోన్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఆర్మీ వైస్ చీఫ్ శరత్ చంద్ర ఘాటుగా హెచ్చరించారు. పాకిస్థాన్ ఆర్మీ అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది.. ఇక మా చేతలే మాట్లాడుతాయని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ సైన్యం సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉందని, దీనికి బదులు తప్పదని అన్నారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి పాకిస్థాన్ అనేక ప్రాంతాల్లో మోర్టార్లతో దాడిచేస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.