యాప్నగరం

శ్రీనగర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. పోలీసుల వీరమరణం, షాకింగ్ వీడియో

Jammu And Kashmir: స్థానికేతరులు, హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు శ్రీనగర్‌లో దాడులకు తెగబడుతున్నారు. బర్జుల్లా ప్రాంతంలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసులు వీరమరణం చెందారు.

Samayam Telugu 20 Feb 2021, 1:03 am
శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఇటీవలే కృష్ణ దాబాపై దాడి చేసిన టెర్రరిస్టులు తాజాగా శివశక్తి స్వీట్ షాప్ వద్ద దాడి చేశారు. స్వీట్ షాప్ ముందున్న పోలీసులను లక్ష్యంగా చేసుకొని సాయుధుడైన ఓ ముష్కరుడు కాల్పులకు తెగబడ్డారు. టెర్రరిస్ట్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పోలీసులను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారని ఉన్నతాధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని బర్జుల్లా పరిధిలోని బఘాట్ ప్రాంతంలో శుక్రవారం (ఫిబ్రవరి 19) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu ఉగ్రవాద దాడి
Srinagar Terrorists Attack


స్వీట్ షాప్ ముందున్న పోలీసులపైకి ఉగ్రవాది కాల్పులు జరిపిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దుస్తుల్లో తుపాకీ దాచుకొని వచ్చిన ముష్కరుడు అక్కడే ఉన్న పోలీసులను అతి సమీపం నుంచి కాల్చాడు. దీంతో వారు రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఉగ్రవాదుల దాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. సాయుధుడైన ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ఉగ్రవాది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం తమ అదుపులోకి తీసుకున్నారు.

స్థానికేతరులు, హిందువులే లక్ష్యంగా..
వారం రోజుల కిందట శ్రీనగర్‌లోని పాపులర్ ఫుడ్ జోన్ కృష్ణ దాబాపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాబా యజమాని కుమారుడిని కాల్చి చంపారు. కొంత మంది విదేశీ రాయబారులు అక్కడ పర్యటిస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి విదేశీ ప్రతినిధుల బృందం అక్కడ పర్యటనకు వచ్చింది.

ఈ ఘటనతో స్థానికుల్లో అభద్రతా భావం నెలకొంది. స్థానికేతరులు, హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బుద్గామ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Also Read:

ఫుట్‌పాత్‌పై తల్లి చెంత పడుకున్న బాలిక.. నోరునొక్కి తీసుకెళ్లి..

‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలి.. గాంధీజీ కల నిజం చేయాలి’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.