యాప్నగరం

ఇవాళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే భక్తులకు అనుమతి

మకర సంక్రాంతి అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజున ఆయన మకర జ్యోతిగా ఆకాశంలో దర్శనం ఇస్తాడని భక్తుల నమ్మకం. దీంతో శబరిమలకు ఈ జ్యోతి దర్శనం కోసం ప్రతీ ఏటా భక్తులు పోటెత్తుతారు.

Samayam Telugu 14 Jan 2021, 10:53 am
అయ్యప్పస్వామి భక్తులకు ఎంతో పవిత్రమైన మకరజ్యోతి దర్శనం ఇవాళ జరగనుంది. సంక్రాంతి పర్వదినాన భక్తులకు మకరజ్యోతి దర్శనం లభించనుంది. ఈ సందర్భంగా గురువారం అయ్యప్ప సన్నిధానానికి తిరునాభరణం ఊరేగింపు చేరుకోనుంది. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి భక్తులు సంక్రాంతి పండుగ రోజు శబరిమలకు వెళ్లి ప్రత్యక్షంగా మకరజ్యోతిని దర్శించుకోవాలని ఆశపడతారు. మకరజ్యోతిని వీక్షించి, తరించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటారు.
Samayam Telugu ఇవాళ మకర జ్యోతి దర్శనం


అయ్యప్పస్వామికి మకర సంక్రాంతి ఎంతో ఇష్టమైనది. తనకు ఇష్టమైన ఈరోజున తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనం ఇస్తానని అయ్యప్పస్వామి చెప్పారని చరిత్ర చెబుతోంది. అందుకే అయ్యప్పస్వామి మాల వేసిన ప్రతి భక్తుడు మకర సంక్రాంతిన శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని, మకరజ్యోతిని చూడాలని ఆశపడుతుంటారు. ఈసారి శబరిమలలో ఎంతో సాధారణంగా మకరవిలక్కు జరగనుంది. కేవలం ఐదు వేల మంది భక్తులు, అర్చకులు, అధికారుల సమక్షంలో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శబరిమల చరిత్రలోనే మొదటిసారి మకరసంక్రాంతిన ఇలా నిరాడబరంగా పూజలు జరుగుతున్నాయి.

కరోనా నేపథ్యంలో ఆలయ అధికారులు శబరిమలలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. శబరిమలకు వచ్చే భక్తులు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని సూచించారు. 48 గంటల్లోపు తీసిన కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్ చెల్లదు. ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షను చేయించుకోవాలి. మకర సంక్రాంతి పూజలు, మకర జ్యోతి దర్శనం అనంతరం జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తామని ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.