యాప్నగరం

రైలు బోగీలో గురక దుమారం.. గురకవీరుణ్ని జాగారం చేయించిన ప్రయాణికులు!

ఎల్‌టీటీ-దర్భంగా పవన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ ప్రయాణికుడి గురక కారణంగా పెద్ద దుమారమే జరిగింది. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది.

TNN 15 Feb 2018, 6:28 pm
Samayam Telugu train traveller snores passengers force him to stay awake
రైలు బోగీలో గురక దుమారం.. గురకవీరుణ్ని జాగారం చేయించిన ప్రయాణికులు!
గురక పెట్టేవాళ్ల మధ్యలో నిద్రించడం అంటే.. అంతకంటే నరకం మరోటి ఉండదేమో! ఓ పక్క నిద్ర పట్టక దిక్కులు చూస్తూ తలగోక్కుంటుంటే.. వాళ్లేమో తాపీగా నిద్రపోతూ పక్కవాళ్లను మరింత నరకయాతనకు గురి చేస్తారు. ఇక రైళ్లలో పరిస్థితి అయితే తెలిసిందే. ఏ అర్ధరాత్రో నిద్ర లేచి గమనిస్తే.. అసలు రైలు బోగీలో ఉన్నామా లేక ఏదైనా అడవిలో ఉన్నామా అనిపించకమానదు. ఎల్‌టీటీ-దర్భంగా పవన్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ ప్రయాణికుడి గురక కారణంగా పెద్ద దుమారమే జరిగింది.

రైలులోని థర్డ్ ఏసీ కోచ్‌లో సాటి ప్రయాణికుడొకరు పెడుతున్న గురక ధాటికి చుట్టుపక్కల బెర్త్‌లవారికి కంటిమీద కునుకు లేకుండాపోయింది. చాలా సేపు ఓపిగ్గా చూసినా.. పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు రైలు బోగీలోని గురక బాధితులంతా కలిసి గురకవీరుడు రామచంద్రను నిద్రలేపారు.

మితిమీరిన గురక కారణంగా తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రామచంద్రను ప్రయాణికులు నిలదీయడంతో.. గొడవ మొదలైంది. చివరకు కొంత మంది సర్ది చెప్పడంతో.. అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. రామచంద్ర కొన్ని గంటల పాటు నిద్రపోకుండా ఉంటే.. తామంతా కాసేపు నిద్రపోవచ్చనుకున్నారు. అదే విషయాన్ని ఆయనకు చెప్పారు.

గొడవలు, నచ్చజెప్పడాలు అన్నీ అయ్యాక చివరికి ప్రయాణికుల మాటకు రామచంద్ర తలొగ్గాడు. నాలుగైదు గంటల పాటు నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. దీంతో మిగిలిన వారంతా ప్రశాంతంగా పడుకున్నారు. పవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో వారం కిందట జరిగిన ఈ ఉదంతాన్ని గణేశ్‌ అనే టికెట్‌ ఇన్స్‌పెక్టర్‌ వెల్లడించారు.

జబల్‌పూర్‌ స్టేషన్‌లో రైలులో విధి నిర్వహణకు వచ్చినప్పుడు ఆ విషయం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జరిగిన ఘటన పట్ల రామచంద్ర ఏమాత్రం కోపం తెచ్చుకోలేదని, తెల్లవార్లూ మెలకువతోనే ఉండి తోటి ప్రయాణికులకు పూర్తిగా సహకరించాడని చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.