యాప్నగరం

కరోనా బారినపడి ఎమ్మెల్యే మృతి.. వైరస్‌తో నెల రోజులు పోరాడి ఓడిన నేత

కరోనా వైరస్ బారిన పడి దేశంలో మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే తమోనష్ ఘోష్ చికిత్స పొందుతూ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు.

Samayam Telugu 24 Jun 2020, 11:24 am
కరోనా వైరస్ బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనష్ ఘోష్ (60) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని ఫల్తా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘోష్.. మే నెలలో కరోనా బారిన పడ్డారు. దీంతో మే 24 నుంచి అపోలో హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది.
Samayam Telugu తమోనష్ ఘోష్
Tamonash Ghosh tmc mla


గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల లాంటి కీలక అవయవాలు దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘోష్ కుటుంబం కోల్‌కతాలోని కాళిఘాట్‌లో నివసిస్తోంది. 2011 నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్న ఆయన.. 1998 నుంచి టీఎంసీ కోశాధికారిగా పని చేస్తున్నారు.

ఘోష్ కరోనా బారిన పడి మరణించడం పట్ల టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా ఆయన తమతో ఉన్నారని.. ప్రజలు, పార్టీ కోసం పాటుపడ్డారని మమత వ్యాఖ్యానించారు. ఆయన సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో ఇప్పటి వరకూ 14,728 కరోనా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 4930 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 9218 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 580 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. జూన్ ఆరంభంలో తమిళనాడుకు చెందిన డీఎంకే సీనియర్ ఎమ్మెల్యే అన్బళగన్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.