యాప్నగరం

కవల సోదరులు.. 900 కి.మీ. దూరంలో ఇద్దరూ ఒకే తరహాలో మృతి

Rajasthan Twins death: తల్లి గర్భంలో కలిసే పుట్టిన కవల సోదరులు విచిత్రమైన పరిస్థితుల్లో గంటల వ్యవధిలో ఒకే రీతిన మరణించారు. మృత్యువు కబళించిన సమయంలో ఒకరికొకరు 900 కి.మీ. దూరంలో ఉన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండున్నర దశాబ్దాల కిందట కవలలుగా ఒకేసారి జన్మించిన సుమేర్, సోహన్ సింగ్‌‌ను వారి స్వగ్రామంలో ఒకే చితిపై దహనం చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 18 Jan 2023, 4:22 pm
పుట్టినప్పుడు ఆ సోదరులిద్దరూ (Rajasthan Twins) కలిసే పుట్టారు. 26 ఏళ్లుగా ఒకరిని విడిచి మరొకరు లేకుండా బతికారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితుల్లో ఒకరికొకరు 900 కి.మీ. దూరంలో ఇద్దరూ దాదాపు ఒకేరకంగా మృతి చెందారు. తల్లిదండ్రులకూ ఏ ఒక్కరూ మిగలకుండా పోయారు. పండుగ (సంక్రాంతి తరహాలో రాజస్థాన్‌లో ఉత్తరాయన్ జరుపుకొంటారు) తీవ్ర విషాదం నింపారు. విధి ఆడిన వింత నాటకం లాంటి ఈ ఘటన రాజస్థాన్‌లోని బార్మర్‌లో చోటుచేసుకుంది. కవలల్లో ఒకరు సూరత్‌లోని ఇంటి టెర్రస్ నుంచి ప్రమాదవశాత్తూ జారి పడి మరణించాడు. గంటల వ్యవధిలోనే అతడి కవల సోదరుడు మరణించాడు.
Samayam Telugu Rajasthan Twins
కవలలు సుమేర్, సోహన్


రెండున్నర దశాబ్దాల కిందట ఒకే తల్లి గర్భాన కవలలుగా ఒకేసారి జన్మించిన సుమేర్, సోహన్ సింగ్‌‌ను వారి స్వగ్రామమైన సార్నో క టాలాలో ఒకే చితిపై దహనం చేశారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనల మధ్య గురువారం (జనవరి 12) వారి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

సుమేర్ గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఓ టెక్స్‌టైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహన్ జైపూర్‌లో గ్రేడ్ II టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. సోహన్ చిన్నతనం నుంచి బాగా చదివేవాడు. సుమేర్ మాత్రం చదువులో వెనుకబడి ఉండేవాడు. కానీ, సోహన్‌ను బాగా ప్రోత్సహించేవాడు. ఎంతలా అంటే, సోహన్ తన టీచర్ కలను పూర్తి చేసుకునేందుకు.. సూరత్‌లో సుమేర్ కష్టపడి పనిచేస్తున్నాడు. అలా కష్టపడి సంపాదించిన డబ్బును తన సోదరుడి టీచర్ రిక్రూట్‌మెంట్ శిక్షణ, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం పంపిస్తున్నాడు.

బుధవారం రాత్రి సుమేర్.. సూరత్‌లో తాను నివాసం ఉంటున్న ఇంటి టెర్రస్ పైనుంచి జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో అతడు ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సోహన్ తన కవల సోదరుడి మరణవార్త విని ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికి సుమేర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధువులందరూ వస్తున్నారు. సోహన్ తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు నుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్లాడు. ఇక తిరిగి రాలేదు.

సోహన్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. చివరికి అతడిని చెరువులో గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుమేర్ మరణవార్త విని మనస్తాపానికి గురై సోహన్ ఆత్మహత్య చేసుకున్నాడేమో అని తొలుత అనుమానించారు. అయితే, అది ప్రమాదమేనని పోలీసులు తేల్చారు. ఎంతో ప్రేమగా ఉండే తోబుట్టువులిద్దరూ గంటల వ్యవధిలో ఒకే తరహాలో మరణించడం గ్రామంలో విషాదం నింపింది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.