యాప్నగరం

కశ్మీర్‌లో చొరబాటుకు భారీగా ఉగ్రవాదులు.. పట్టుబడ్డ ఇద్దరు లష్కరే ముష్కరులు

కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుచేయడంతో పాకిస్థాన్ ఎక్కడలేని అసహనం వ్యక్తంచేస్తోంది. కశ్మీర్‌లో మానవహక్కుల హరించుకుపోతున్నాయని గగ్గోలు పెడుతోంది.

Samayam Telugu 4 Sep 2019, 4:26 pm
లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులను ఆగస్టు 21న ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్టు చినార్ కార్ప్స్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ తెలిపారు. శ్రీనగర్‌లో మీడియా కాన్ఫెరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కశ్మీర్‌ లోయలో శాంతికి విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, ముఖ్యంగా ఆగస్టు 5 తర్వాత మరిన్ని ప్రయత్నాలు చేస్తోందని ధిల్లాన్ అన్నారు. లోయలోకి వీలైనంత మేర ఉగ్రవాదులను పంపాలన్న పాక్ ప్రయత్నాలు నెరవేరడం లేదని, సరిహద్దుల్లోని శిబిరాలన్నీ ఉగ్రవాదులతో నిండిపోయాయని, వారిని కశ్మీర్‌లోకి పంపేందుకు రోజూ ప్రయత్నిస్తోందని అన్నారు. ఆగస్టు 21న అలాంటి ప్రయత్నమే చేయగా, ఈ ఇద్దరు ఉగ్రవాదులూ పట్టుబడ్డారని ఆయన తెలిపారు. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన పాకిస్థానీలను సైన్యం అరెస్ట్ చేసిందన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలీల్ అహ్మద్, మొజమ్ ఖోకర్‌లను బారాముల్లా జిల్లాలోని బొనియార్ సెక్టార్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
Samayam Telugu pakist2


భారీగా ఉగ్రవాదులు చొరబడేందుకు ఈ ఇద్దరూ రెక్కీ నిర్వహిస్తూ పట్టుబడినట్టు జనరల్ ధిల్లాన్ వివరించారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉగ్రవాదులకు పాక్ సైన్యానికి చెందిన 50 మంది శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. శిక్షణ తర్వాత ఈ ఉగ్రవాదులు రేషియాన్ గలీ, కండ్లన్ గలీ గుండా జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడేందుకు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. వీరితోపాటు 80 నుంచి 90 మంది ఎస్ఎస్‌జీ కమాండోలు ముజఫరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. పాక్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్) వీరి సాయంతో హజీపూర్ నలా వద్ద భారత భద్రతా దళాలపై దాడికి కుట్రపన్నినట్టు సమాచారం. జురా, జబ్బార్ వ్యాలీ వద్ద భారత ఆపరేషన్ల నుంచి సురక్షితంగా బయటపడేందుకు బంకర్లను నియమిస్తున్నట్టు నిఘా వర్గాలు తెలిపారు.

కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుచేయడానికి ముందే లోయలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించారు. అనంతరం జమ్మూ కశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజించారు. జమ్మూ కశ్మీర్, లడఖ్‌లుగా వేరుచేసి వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. అయితే, ఢిల్లీ మాదిరిగా జమ్మూ కశ్మీర్‌కు అసెంబ్లీ ఉంటుంది.

మరోవైపు, కశ్మీర్ విషయంలో భారత్ నిర్ణయాన్ని అంతర్జాతీయ వేదికలపై చర్చించి లబ్ది పొందాలని చూసిన పాక్ ఆశలు అడియాశలయ్యాయి. ఈ విషయంలో పాక్ వాదనకు ఏ దేశం కూడా మద్దతు తెలపడం లేదు. అంతేకాదు, ఇది ద్వైపాక్షిక అంశమని, భారత్‌తో కలిసి చర్చించుకోవాలని సలహా ఇస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ మరింత అసహనం వ్యక్తం చేస్తోంది. కశ్మీరీల కోసం ఎంతకైనా పోరాడతమని, అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనుకాడబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.