యాప్నగరం

Srinagar: ఉగ్రవాదుల దొంగదెబ్బ.. ఇద్దరు జవాన్ల వీరమరణం

Jammu Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో ఇండియన్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు.

Samayam Telugu 26 Nov 2020, 4:54 pm
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లో మరోసారి దొంగదెబ్బ తీశారు. శ్రీనగర్‌లో గురువారం (నవంబర్ 26) మధ్యాహ్నం భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. జవాన్లపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అనంతరం ఓ కారులో అక్కడ నుంచి తప్పించుకున్నారు. పారిపోయిన ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని కశ్మీర్ ఐజీ తెలిపారు.
Samayam Telugu శ్రీనగర్ ఉగ్రదాడి (ప్రతీకాత్మక చిత్రం)
Srinagar terror attack


ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను సహచరులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ జవాన్లు కన్నుమూశారని రక్షణ శాఖ, శ్రీనగర్ విభాగం పీఆర్‌వో తెలిపారు. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది.

ఈ దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు. వారిలో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు కాగా.. మరొకడిని స్థానికుడిగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉగ్రవాదులను త్వరలోనే పట్టుకుంటామని దీమా వ్యక్తం చేశారు. శ్రీనగర్‌ను తమ ఆధీనంలోకి తీసుకొని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.


జమ్మూ కశ్మీర్‌లో కొంత కాలంగా ఉగ్రవాదులు చాప కింద నీరులా కార్యకలాపాలు సాగిస్తున్నారు. భారత్‌లో మరోసారి భారీ విధ్వంసం సృష్టించడానికి పథక రచన చేస్తున్నారు. ముష్కరుల కుట్రను ముందుగానే పసిగట్టి ఇండియన్ ఆర్మీ, కశ్మీర్ పోలీసులు దీటుగా బదులిస్తున్నారు. ఇటీవల కశ్మీర్‌లోని నగ్రోటాలో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. వీరు ముంబై తరహా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నినట్లు ఆ తర్వాత తెలిసింది. భద్రతా బలగాల ధైర్య, సాహసాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.

Must Read: భారీ ఉగ్రకుట్ర భగ్నం.. మోదీ ఉన్నతస్థాయి సమీక్ష, జవాన్లకు ప్రశంసలు

Also Read: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌కు శిక్ష విధించిన పాక్ కోర్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.