యాప్నగరం

కేంద్ర మంత్రిపై హత్యాయత్నం?

కేంద్ర సహాయ మంత్రి అనంత్ కుమార్ హెగ్డేపై కర్ణాటకలో హత్యాయత్నం జరిగింది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలపై ఓ భారీ ట్రక్కు దూసుకొచ్చింది.

TNN 24 Apr 2018, 3:05 pm
ప్రస్తుతం కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డేపై బుధవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. అయితే ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ భారీ ట్రక్కు బలంగా ఢీకొంది. కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మంత్రి అనంత్ కుమార్‌ భుజానికి గాయమవ్వగా, ఆయన కాన్వాయ్‌లోని వారికి కూడా గాయాలైనట్టు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను హతమార్చడానికే ఈ దాడి జరిగిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత సహాయ మంత్రి హెగ్డే ఆరోపించారు.
Samayam Telugu union minister suspects attempt on life after truck hits his escort vehicle
కేంద్ర మంత్రిపై హత్యాయత్నం?


ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, ఎవరో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాధారణ వేగంతో వెళ్తోన్న తమ వాహనాన్ని వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టిందని తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తే ఇది హత్యాయత్నమేనని స్పష్టంగా తెలిసిపోతుందని పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్‌ ఫొటోలను తన ట్విటర్‌ లో పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి, అతడి పేరు నసీర్ అని పేర్కొన్నారు. అతడిని పోలీసులు విచారించి, పూర్తి వివరాలు సేకరించాలని కోరిన ఆయన, దీని వెనుక ఉన్నదెవరో బయటకు లాగాలని అన్నారు.

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు హవేరీ ఎస్పీ పరాశురం తెలిపారు. అయితే ఇది హత్యాయత్నం కాదని, కేవలం ప్రమాదమేనని ప్రాథమికంగా నిర్ధరించినట్టు ఆయన స్పష్టం చేశారు. దీనిపై దర్యాప్తునకు రానేబెన్నూర్ డిప్యూటీ ఎస్పీ సారథ్యంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.