యాప్నగరం

Mulayam Singh Yadav: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ కన్నుమూత

Mulayam Singh Yadav కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత నెల 22న అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో ములాయం సింగ్ చేరారు. అప్పటి నుంచి ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ సహయంతో వైద్యులు చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ములాయం మరణించారు. ఆయన మరణ వార్తతో సమవాజ్ వాదీ పార్టీ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Samayam Telugu 10 Oct 2022, 10:30 am
Mulayam Singh Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ములాయం మృతితో సమాజ్ వాదీ పార్టీ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి వార్త తెలుసుకున్న బంధువులు, పార్టీ శ్రేణులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో ఆగస్టు 22న మేదాంత ఆస్పత్రిలో ములాయం చేరారు. ఆరోగ్యం మరింత విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ సపోర్టుతో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు.
Samayam Telugu mulayam singh yadav
ములాయం సింగ్ యాదవ్


మూర్తి దేవి, సుఘర్ సింగ్ యాదవ్ దంపతులకు ములాయం సింగ్ యాదవ్ 1939 నవంబరు 22న ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా జిల్లాలోని సైఫాయ్ గ్రామంలో జన్మించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు వరుసగా ఆయన పనిచేశారు. గతంలో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ఇంతకు ముందు అజమ్‌గఢ్, సంభాల్ నియోజకవర్గాల నుంచి ఎంపీగా ములాయం గెలిచారు.

లోహియా, రాజ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ములాయం.. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి యూపీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ములాయం.. 1977లో తొలిసారి మంత్రి అయ్యారు. 1980లో లోక్ దళ్ అధ్యక్షుడిగా పనిచేసిన ములాయం..1982లో యూపీ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. లోక్ దళ్ చీలిక తర్వాత క్రాంతికారీ పార్టీని ములాయం ప్రారంభించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలల పాటు జైలుజీవితం గడిపారు.

ములాయం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మొదటి భార్య మాలతీదేవి కుమారుడు. రెండో భార్య సాధనకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. 2003లో మొదటి భార్య మాలతీదేవి మృతి చెందగా.. రెండో భార్య సాధనా గుప్తా ఊపిరితిత్తుల వ్యాధితో 2022 జులై 9న మరణించారు. సాధనా గుప్తా కోడలు అపర్ణా యాదవ్ ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.