యాప్నగరం

వలస కార్మికుల కోసం ఆ నిధులు ఖర్చుచేయండి.. రాష్ట్రాలకు కేంద్రం సూచన

దేశంలో కరోనా వైరస్ కేసుల క్రమంగా పెరగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం ఒక్క రోజే దాదాపు 150 కేసులు నమోదుకావడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Samayam Telugu 28 Mar 2020, 3:58 pm
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రంగంలోని దిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా 1,000 బస్సులను సిద్ధం చేసింది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వేలాది మంది కూలీలు, వలసజీవులు అక్కడ చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక, సొంతూళ్లు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. వీరిలో కొంత మంది వందల కిలోమీటర్లు దూరంలోని తమ స్వస్థలాలకు కాలినడక వెళ్లేందుకు వెనుకాడటం లేదు. ఢిల్లీలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వాసులు కొందరు కాలినడక బయలుదేరిన విషయం ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ దృష్టికి రావడంతో తక్షణమే వారిని స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Samayam Telugu bus


శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అత్యవసరంగా ఆదేశాలు జారీచేసిన సీఎం.. బాధితులకు ఆహారం, మంచినీళ్లు తక్షణమే అందజేయాలని ఆదేశించినట్టు ఓ అధికారి తెలిపారు. దీంతో శనివారం ఉదయం పోలీస్ ఉన్నతాధికారులు లక్నోలోని చార్‌బాగ్ బస్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ ఉన్న బాధితులకు ఆహారం అందజేశారు. తర్వాత కాన్పూర్, బల్లియా, వారణాసి, గోరఖ్‌పూర్, అజమ్‌గఢ్, ఫైజాబాద్, బస్తీ, ప్రతాప్‌గఢ్, సుల్తాన్ పూర్, అమేథీ, రాయబరేలీ, గోండా, ఎటవా, బహ్రెయిచీ, శ్రీవాస్తవ ప్రాంతాలకు మొత్తం 1,000 బస్సులను పంపారు.

కరోనా వైరస్ నియంత్రణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. వలసకార్మికులు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆయన సూచించారు. వారికి అవసరమైన ఆహారం, తాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించేలా తమ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందని తెలిపారు. అందువల్ల ఎవరూ తమ ఊళ్లకు వెళ్లాలనే ఆలోచన చేయవద్దనీ.. లాక్‌డౌన్‌ ఉద్దేశం అర్థంచేసుకొని సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. వలస కార్మికుల సహా ఇళ్లులేని వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులను ఉపయోగించి ఆహారం, తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. తాత్కాలిక వసతి, వస్త్రాలు, వైద్య సాయం కోసం ఈ నిధులను వెచ్చించాలని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.