యాప్నగరం

డాక్టర్లపై దాడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష.. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం

కరోనా మహమ్మారిని నిలువరించడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై కొందరు దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది.

Samayam Telugu 22 Apr 2020, 3:44 pm
కరోనాపై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న హెల్త్ వర్కర్లపై దాడి చేస్తే.. శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించింది. హెల్త్‌ వర్కర్లు తీవ్రంగా గాయపడితే.. దాడి చేసిన వారికి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని.. లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ జవదేకర్.. హెల్త్ వర్కర్లపై దాడి చేయడం అమానుషం అన్నారు. హెల్త్ వర్కర్లు దేశాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంటే.. వారిపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దాడులకు సహించబోమన్నారు.
Samayam Telugu javadekar


డాక్టర్లపై దాడి చేసిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఎపిడిమిక్ డిసీజెస్ యాక్ట్ 1897కు సవరణలు చేశామని జవదేకర్ తెలిపారు. రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందన్నారు. హెల్త్ వర్కర్ల వాహనాలు, క్లినిక్‌లను ధ్వంసం చేస్తే.. మార్కెట్ ధరకు రెండింతల మొత్తాన్ని దాడి చేసిన వారి దగ్గర్నుంచి వసూలు చేస్తామన్నారు.

ఆరోగ్య సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి 30 రోజుల్లో విచారణ చేపడతామని మంత్రి తెలిపారు. వీరికి 3 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తామని జవదేకర్ హెచ్చరించారు.

ఇక నుంచి హెల్త్ బ్రీఫింగ్‌లను వారానికి నాలుగు రోజులకు పరిమితం చేస్తున్నట్లు జవదేకర్ తెలిపారు. ప్రెస్ రిలీజ్‌లు, కేబినెట్ బ్రీపింగ్‌లు రోజు విడిచి రోజు ఉంటాయన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.