యాప్నగరం

కోవిడ్‌తో యూపీ క్యాబినెట్ మంత్రి కమలా రాణి మృతి

రెండు వారాల కిందట కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఉత్తరప్రదేశ్ మంత్రి ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ చనిపోయారు.

Samayam Telugu 2 Aug 2020, 2:42 pm
దేశంలో కోవిడ్ మహమ్మారి ఉద్ధృతి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే సామాన్యులు సహా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి కరోనాతో మృతిచెందారు. కోవిడ్ బారినపడ్డ మంత్రి కమలా రాణి వరుణ్ (62) ఆదివారం ఉదయం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న మంత్రి.. గత కొద్ది రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్నారు. యోగి క్యాబినెట్‌లో సాంకేతి విద్యాశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కరోనా వైరస్ సోకడంతో జులై 18న హాస్పిటల్‌లో చేరిన మంత్రి కమలా రాణి.. అప్పటి నుంచి చికిత్స కొనసాగుతోంది. కోవిడ్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించింది. వైద్యులు ఆమెను బతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

‘క్యాబినెట్ మంత్రి కమలా రాణికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో జులై 18న ఎస్జీపీజీఐలో చేరారు.. ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి.. ఆమెకు హైపోటెన్షన్‌తోపాటు అవయవాలు పనిచేయకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది.. ఆదివారం ఉదయం మరింత విషమించి కన్నుమూశారు’ అని ఎస్జీపీజీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే ధిమాన్ అన్నారు.

మంత్రి కమలా రాణి మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆమె చేసిన సేవలు మరువలేనవని, ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయ నేతగానే కాదు, సామాజిక కార్యకర్తగానూ ఆమె సేవలు ప్రశంసనీయమని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.