యాప్నగరం

ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం..

Uttar Pradesh: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 5 Feb 2021, 12:47 am
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాన్వాయ్‌‌లో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి నాలుగు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రియాంకతో పాటు మరెవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో గురువారం (ఫిబ్రవరి 4) ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu ప్రియాంక గాంధీ
Priyanka Gandhi


వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో భాగంగా జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న నవ్‌రీత్ సింగ్.. వాహనం తిరగబడటంతో అక్కడికక్కడే మరణించాడు. రాంపూర్ పరిధిలోని అతడి స్వస్థలంలో ఆ రైతు అంత్యక్రియలు జరిగాయి. గురువారం ఉదయం ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రియాంక గాంధీ ప్రయాణిస్తున్న కారు వైపర్లు పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు అద్దంపై పేరుకున్న దుమ్ముతో రోడ్డు కనిపించకపోవడంతో.. డ్రైవర్ కారు వేగం తగ్గించాడు. దీంతో వెనుక ఉన్న వాహనాలు ప్రియాంక వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఘటన అనంతరం కారు అద్దాలను ప్రియాంక స్వయంగా శుభ్రం చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమె యధావిధిగా రాంపూర్ పర్యటనకు వెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.