యాప్నగరం

నేతలపై క్రిమినల్ కేసులు.. పార్టీ ఫిరాయింపులపై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవాలంటే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న లోపాలను సరిదిద్దితెనే సాధ్యమని, రాజకీయ నేతలపై క్రిమినల్ కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

Samayam Telugu 19 Dec 2019, 9:55 am
చట్టసభల్లో సభ్యుల అనుచిత ప్రవర్తనపై ఆయా రాజకీయ పార్టీలే చర్యలు తీసుకోవాలని ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం సూచించారు. అంతేకాదు, సభలోని క్రమశిక్షరహిత దృశ్యాలపై మాత్రమే కాకుండా సభ్యులు వ్యక్తపరిచే మంచి మాటలను, అభిప్రాయాలపై కూడా మీడియా దృష్టిసారించాలని ఆయన సలహా ఇచ్చారు. రాజకీయ పార్టీలు తమ సభ్యుల అనుచిత ప్రవర్తలపై కచ్చితంగా చర్యలు తీసుకుని, అదుపులో ఉంచాలని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెంకయ్య ఉద్ఘాటించారు. రాజ్యసభను దేశం మొత్తం పెద్దల సభగా చూస్తున్నందున సభ్యులు హుందాగా, క్రమశిక్షణతో నడుచుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలవాలని ఉప-రాష్ట్రపతి కోరారు.
Samayam Telugu venkaiah


అంతేకాదు, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉండాలని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా పలువురు సభ్యులు అద్భుత ప్రసంగాలు చేశారు కానీ, వాటిని మీడియా కవర్ చేయలేదని అన్నారు. సభ్యుల ఆందోళనలను మాత్రమే మీడియా ప్రసారం చేస్తోందని, వారి వాణిని మాత్రం వినిపించడంలేదని అన్నారు. ఈ విషయంలో మీడియా అంతఃపరిశీలన చేసుకోవాలని వెంకయ్య సూచించారు.

అలాగే, సుప్రీంకోర్టుకు నాలుగు ప్రాంతీయ ధర్మాసనాలను ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందని రాజ్యసభ ఛైర్మన్ మరోసారి నొక్కిచెప్పారు. రాజ్యాంగపరమైన కేసులు మినహా సివిల్‌, క్రిమినల్‌ అపీళ్లను వాటికి వదిలేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల సుప్రీంకోర్టుపై పని భారం, కక్షిదారులకు ఆర్థిక భారం తగ్గుతాయని వ్యాఖ్యానించారు. రాజకీయ నేతలపై నమోదయ్యే క్రిమినల్‌ కేసుల్లో ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని, ఎన్నికల సంబంధిత పిటిషన్లపై సత్వర విచారణకు ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటుచేయాలన్నారు.

పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టపరమైన లోపాలను సరిదిద్దాల్సిన అవసరముందని వెంకయ్య పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచినవారు మరో పార్టీలో చేరి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించినా, వారి పదవీకాలం పూర్తయ్యేంతవరకూ స్పీకర్లు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలేదన్నారు. ఏదైనా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూడింట రెండొంతుల మంది మూకుమ్మడిగా మరో పార్టీకి మద్దతు తెలిపితే అనర్హత వేటు వేయడానికి వీలు లేకుండా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ రెండు లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. తానేమీ స్పీకర్ల అధికారాలను తొలగించాలనడం లేదని, అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తయితే బాగుంటుందని వెంకయ్య అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.