యాప్నగరం

కొవాగ్జిన్‌ తీసుకున్న వలంటీర్‌ మృతి.. టీకా కారణం కాదా?

Bhopal: భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వేయించుకున్న వలంటీర్ ఒకరు మృతి చెందడం కలకలం రేపుతోంది. భోపాల్‌లో డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 9 Jan 2021, 8:05 pm
దేశీయ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న ఓ వలంటీర్ మృతి చెందిన వార్త కలకలం రేపుతోంది. 45 ఏళ్ల ఆ వలంటీర్‌ టీకా తీసుకున్న 10 రోజుల తర్వాత మృతి చెందాడు. భోపాల్‌లో ప్రయోగ కేంద్రంలో డిసెంబర్ 21న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. వలంటీర్ మరణించడానికి వ్యాక్సిన్ కారణం కాదని వైద్యులు, అధికారులు చెబుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Volunteer Death (Representational Image)


ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి కాకముందే ప్రజలకు పంపిణీ చేయడానికి ఎలా అనుమతిచ్చారంటూ ఇప్పటికే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్న వేళ ఈ ఘటన ప్రకంపనలు రేపుతోంది.

అసలేం జరిగింది?
భోపాల్‌కు చెందిన దీపక్ మరవి (45) భారత్ బయోటెక్ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ కోసం వలంటీర్‌గా రిజిస్టర్ చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 12న పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హస్పిటల్‌లో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొని కొవాగ్జిన్‌ డోసు తీసుకున్నారు. ఆ తర్వాత పది రోజులకు ఆయన మరణించారు.

వ్యాక్సిన్‌ తీసుకుని ఇంటికొచ్చాక.. మరవి కొంత ఇబ్బందిపడ్డారని, అనారోగ్య సమస్యలు తలెత్తాయని కుటుంబసభ్యులు తెలిపారు. ‘డిసెంబర్‌ 17న భుజం నొప్పితో బాధపడ్డాడు. రెండు రోజుల తర్వాత నోటి నుంచి నురగ వచ్చింది. డాక్టర్‌ దగ్గరకు వెళ్దాం అంటే వినలేదు. రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని అన్నాడు. ఆ తర్వాత ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. డిసెంబర్‌ 21న ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు’ అని వాళ్లు తెలిపారు.

దీపక్‌ మరవి ట్రయల్స్‌లో పాల్గొన్నాడనడానికి రుజువుగా అతడికి ఎలాంటి రసీదు, లెటర్‌ ఇవ్వలేదని రజనా ధింగ్రా అనే సామాజిక కార్యకర్త ఆరోపించారు.

ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు మృతి.. అకస్మాత్తుగా!
‘దీపక్ మరవి విష ప్రయోగం వల్ల మరణించాడని అనుమానిస్తున్నాం. కానీ, మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. విసెరా పరీక్షతో మరవి ఎందువల్ల చనిపోయాడనే తెలుస్తుంది’ అని మెడికల్‌ కాలేజీ వైస్‌ చాన్స్‌లర్‌ అన్నారు. కొవాగ్జిన్‌ ట్రయల్స్‌లో ఆయన పాల్పంచుకున్నారు.

దీపక్‌ మరవికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు అతడు విషప్రయోగం వల్ల చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడని మధ్యప్రదేశ్‌ మెడికో లీగల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ శర్మ తెలిపారు. కానీ, మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదన్నారు. ‘మరవి డిసెంబర్‌ 21న చనిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే డీసీజీఐ, భారత్‌ బయోటెక్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఇక వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొనడాకి ముందు మరవికి అన్ని పరీక్షలు చేశాం. అంతా బాగుంది అనుకున్నాకే వ్యాక్సిన్‌ డోసు తీసుకునేందుకు అనుమతిచ్చాం’ అని ఆయన అన్నారు.

ట్రయల్స్ పాల్గొన్న అందరికి టీకా ఇవ్వరు..
ట్రయల్స్‌లో పాల్గొన్న అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వరని డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. సగం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చి, మిగతావారికి సెలైన్‌ ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం దీపక్‌కి ఇచ్చింది వ్యాక్సిన్‌ డోసా లేదా సెలైనా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు. అంతేకాకుండా ట్రయల్స్‌లో పాల్గొన్న అందరినీ టీకా తీసుకున్న తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించామని తెలిపారు. ఆ తర్వాత ఎనిమిది రోజులు వారిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.