యాప్నగరం

యుద్ధం వస్తే.. పది రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్: ప్రధాని మోదీ

చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధమంటూ వస్తూ పది రోజుల్లోనే పాకిస్థాన్‌ను ఓడిస్తామన్నారు.

Samayam Telugu 28 Jan 2020, 7:14 pm
పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్న వేళ.. బీజేపీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చట్టం వల్ల భారతీయులెవరికీ ఎలాంటి నష్టం తలెత్తదని కేంద్రం భరోసా ఇస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం విషయమై హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ చట్టంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. చారిత్రక అన్యాయాన్ని సరి చేయడానికి.. బీజేపీ గతంలో ఇచ్చిన మాటను నెరవేర్చడానికి పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చామన్నారు.
Samayam Telugu modi speach


యాన్యువల్ ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) ర్యాలీ 2020లో ప్రసంగించిన మోదీ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జమ్మూ కశ్మీర్ సమస్య ఉందన్నారు. కొన్ని కుటుంబాలు, రాజకీయ పార్టీలు ఈ ప్రాంతంలో సమస్యలను సజీవంగా ఉంచాయని ఆరోపించారు. ఫలితంగానే ఇక్కడ ఉగ్రవాదం వృద్ధి చెందిందన్నారు.

దేశాన్ని దశాబ్దాలుగా వేధిస్తున్న పాత సమస్యలను పరిష్కరించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. మూడు యుద్ధాల్లో ఓడినప్పటికీ.. పొరుగు దేశం భారత్‌పై పరోక్ష యుద్ధం చేస్తోందంటూ పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్మీ చర్యకు సిద్ధపడినా గత ప్రభుత్వాలు అంగీకరించలేదన్న మోదీ.. కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వాల అనిశ్చిత స్థితిని తప్పుబట్టారు. పరోక్ష యుద్ధం ద్వారా పాకిస్థాన్ వేలాది మంది సైనికులు, ప్రజలను పొట్టన బెట్టుకుంటోందని మోదీ ఆరోపించారు. యుద్ధమంటూ వస్తే.. పాకిస్థాన్‌ను ఓడించడానికి భారత బలగాలకు 10-12 రోజుల సమయం సరిపోతుందన్నారు.

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య ప్రాంత ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని.. కశ్మీరే కాకుండా దేశంలోని మిగతా ప్రాంతాలూ ప్రశాంతంగా ఉన్నాయన్నారు. బోడే ఒప్పందం, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.