యాప్నగరం

కిరాణా వ్యాపారి ప్రాణం తీసిన జీఎస్టీ!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది.

TNN 26 Jul 2017, 9:01 am
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. జీఎస్టీ వల్ల తీవ్రంగా నష్టపోయిన ఓ కిరాణా వ్యాపారి తన దుకాణంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని బిర్‌భూమ్ జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పినాకి దత్తా (44) హోల్‌సేల్ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ నెట్‌వర్క్‌లో ఆయన నమోదు చేసుకోలేదు. దీంతో ఆయనకు జీఎస్టీ నంబర్ రాలేదు.
Samayam Telugu west bengal businessman commits suicide blames gst
కిరాణా వ్యాపారి ప్రాణం తీసిన జీఎస్టీ!


జీఎస్టీ నంబర్ లేకపోవడంతో డీలర్లు ఆయనకి సరుకు ఇవ్వడం మానేశారు. వ్యాపారానికి సరిపడా సరుకు లేకపోవడంతో నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన దుకాణానికి పక్కనే ఉన్న ఓ గొడౌనులో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం దుకాణానికి వెళ్లిన భర్త.. మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో ఆయన భార్య సువర్ణ అక్కడి వెళ్లారు. దుకాణంలో ఆయన లేకపోవడంతో పక్కనే ఉన్న గొడౌనుకు వెళ్లి చూశారు. అక్కడ తన భర్త నురగలు కక్కుకుంటూ విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే అక్కడున్నవాళ్లను పిలిచి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పినాకి దత్త జేబులో ఉన్న సూసైట్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖలో ‘నా చావుకు కేవలం జీఎస్టీనే కారణం. ఇంకెవ్వరూ కాదు’ అని రాసి ఉంది. ఈ విషయాన్ని బిర్‌భూమ్ ఎస్పీ సుధీర్‌కుమార్ ధ్రువీకరించారు. సూసైట్ లెటర్‌లో ‘జీఎస్టీ’ అని రాసి ఉన్నప్పటికీ.. దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ దత్తా మరణానికి గల కారణాలపై ఒక అంచనాకు రాలేమని వెల్లడించారు. కాగా, పినాకి దత్తాకు ఇద్దరు పిల్లలు. పాప మూడో తరగతి చదువుతుండగా.. బాబు రెండో తరగతి చదువుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.