ఆన్లైన్లో పెళ్లి… జొమాటోలో విందు భోజనం
కోవిడ్ వైరస్ కారణంగా పెళ్లిళ్లు చేసుకునే విధానంలో మార్పులు వచ్చాయి. దీంతో నేటితరం యువత టెక్నాలజీని జోడించి సరికొత్త పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ జంట కూడా అలాగే ఒకటి కానున్నారు.
Samayam Telugu 18 Jan 2022, 6:34 pm
ప్రధానాంశాలు:
- గూగుల్ మీట్లో వినూత్నంగా వివాహం
- జనవరి 24న సందీపన్, అదిథి పెళ్లి
- 450 మంది అతిథులకు ఆహ్వానం
ఆర్భాటాలు లేకుండా ఆన్లైన్ పెళ్లిళ్లకు నేటి తరం యువతీ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. సంప్రదాయానికి టెక్నాలజీని జోడించి.. సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నారు. కోవిడ్ పుణ్యమా అని ఈ పద్ధతికి మద్దతు కూడా లభిస్తోంది. తాజాగా ఓ జంట కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా.. ఎవరిని నొప్పించకుండా వినూత్నంగా వివాహం చేసుకోబోతుంది.
సందీపన్, అదిథి తమ పెళ్లి వేడుకను గూగుల్ మీట్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి 450 మంది అతిథులను ఆహ్వానించారు. పెళ్లి తేదీకి ఒక రోజు ముందు చుట్టాలకు గూగుల్ మీట్లో ఓ లైవ్ లింక్, పాస్ వర్డ్ను పంపించనున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసి బంధువులు తమ ఇళ్ల నుంచే పెళ్లిని తిలకించి, యువ జంటను ఆశీర్వదించవచ్చు. ఇక భోజనాలు లేకుండా పెళ్లి తంతు ఉండదు. పెళ్లికి విందు భోజనం తప్పనిసరి. దీనికోసం కూడా వారో ఓ ప్లాన్ వేశారు. అతిథులకి వారు జొమాటోలో భోజనం ఆర్డర్ చేసి వారి ఇళ్లకు డెలివరి చేయనున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఈ మధ్య యువత టెక్నాలజీని ఉపయోగించుకుని వినూత్న పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ జంట తమ పెళ్లి రిసెప్షన్ను మెటావర్స్లో వర్చువల్గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే మొదలుపెట్టారు.