యాప్నగరం

ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసల జల్లు

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధనోమ్ గెబ్రెయేసస్‌ ప్రశంసలు జల్లు కురిపించారు.

Samayam Telugu 27 Sep 2020, 2:30 pm
కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరులో భాగంగా వివిధ దేశాలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసించింది. ఇందులో భాగంగా టీకా సరఫరాపై అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ కొనియాడారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న భారత్‌, ప్రపంచ దేశాలకు సహాయపడుతుందని మోదీ ఇచ్చిన హామీపై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ స్పందించారు. ‘‘కరోనా పోరులో మీ నిబద్ధతకు ధన్యవాదాలు. ప్రపంచ శ్రేయస్సు కోసం మన దగ్గరున్న శక్తులను, వనరులను కలిసికట్టుగా సమీకరించడం ద్వారానే ఈ మహమ్మారికి ముగింపు పలకగలం’’ అని ప్రధాని నరేంద్ర మోదీని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ కొనియాడారు.
Samayam Telugu డబ్ల్యూహెచ్ఓ చీఫ్, ప్రధాని మోదీ


ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శనివారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యావత్‌ ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌వైపు చూస్తోందని, తమకున్న సామర్థ్యంతో మానవాళిని ఈ మహమ్మారి నుంచి బయటపడేయగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయన్నారు. అలాగే కరోనా మహమ్మారి విజృంభణ సమయంలోనూ భారత ఔషధ పరిశ్రమ 150 దేశాలకు అత్యవసర మందులు పంపించిందని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి ఇంకెంతకాలం దూరంగా ఉంచుతారని నిలదీశారు. ఈ తరుణంలో ప్రధాని మోదీని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.