యాప్నగరం

Wrestlers Protest నార్కో పరీక్షలకు సిద్ధమే.. కానీ, ఒక్క కండిషన్.. బ్రజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు

Wrestlers Protest బిజెపి ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, ఆసియా ఛాంపియన్‌ వినేష్‌ ఫోగట్‌, సంగీతా ఫోగట్‌, ఇతర ప్రముఖ రెజ్లర్లు ఏప్రిల్‌ 23 నుంచి దేశ రాజధానిలో బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 May 2023, 8:52 am

ప్రధానాంశాలు:

  • లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్
  • మహిళా రెజ్లర్లకు మద్దతు తెలిపిన హరియాణా రైతు సంఘాలు
  • నార్కో పరీక్షలు డిమాండ్ చేస్తోన్న ఖాప్ పంచాయతీ పెద్దలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బ్రిజ్ భూషణ్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు (WFI), బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌ (Brij Bhushan) నార్కో అనాలసిస్‌ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, తనతోపాటు మరో ఇద్దరికి కూడా నార్కో పరీక్షలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బ్రిజ్ భూషణ్‌ రాజీనామా కోరుతూ గత కొద్ది రోజుల నుంచి జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న రెజర్లకు రైతు సంఘాలు సైతం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం హరియాణాలో జరిగిన ఖాప్‌ పంచాయితీలో బ్రిజ్‌ భూషణ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని పెద్దలు తీర్మానించారు.
దీనిపై స్పందించిన బ్రిజ్‌ భూషణ్‌ తనతోపాటు వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat), బజరంగ్ పునియా (Bajrang Punia)లకు సైతం నార్కో పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘నార్కో, పాలిగ్రాఫ్‌, లై డిటెక్టర్‌ పరీక్షలకు నేను సిద్ధం. కానీ, నాతోపాటు వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియాలు కూడా ఈ పరీక్షలకు చేయించుకోవాలి.. వారు ఈ పరీక్షలకు అంగీకరిస్తే మీడియా ముందు ప్రకటించాలి.. వారు ఈ పరీక్షలకు సిద్దమైతే.. నేను కూడా సిద్ధం’ అని ఫేస్‌బుక్‌‌‌లో బ్రిజ్ భూషణ్ పోస్ట్ చేశారు. అంతేకాదు, తాను 2014లో రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావించాను కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వారించడంతో విరమించుకున్నానని అన్నారు.

గత నెల రోజులుగా వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌లతోపాటు మరికొంత మంది మహిళా రెజ్లర్లు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా బజరంగ్ పునియా వంటి ఒలింపియన్లు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్ల ఆందోళనకు రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా (SKM) మద్దతు తెలిపింది. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అటు, మహిళా రెజ్లర్ల ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎదురుదాడి చేస్తున్నారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.