యాప్నగరం

హథ్రాస్ కేసు: మా స్నేహం ఇష్టంలేక ఆమెను కుటుంబమే హత్యచేసింది.. నిందితుడు సంచలన ఆరోపణలు

హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో నిందితుడు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. చనిపోయిన యువతితో తనకు స్నేహం ఉందని లేఖ రాయడం చర్చనీయాంశమయ్యింది.

Samayam Telugu 8 Oct 2020, 3:18 pm
హథ్రాస్ ఘటనలో ప్రధాన నిందితుడు బాధితురాలి కుటుంబసభ్యులలో ఒకరితో తరుచూ సంభాషించినట్టు యూపీ పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, తమను కుట్రపూరితంగా ఇరికించారని పేర్కొంటూ ప్రధాని నిందితుడు సందీప్ ఠాకూర్ పోలీసులకు లేఖ రాశాడు. బాధిత యువతిని ఆమె కుటుంబసభ్యులే హింసించి హత్యచేశారని ఆరోపించారు. తామిద్దరం స్నేహితులమని, తరుచూ ఫోన్‌లో మాట్లాడుకుండేవాళ్లమని లేఖలో వివరించాడు.
Samayam Telugu హథ్రాస్ ఘటన
Hathras Case


తమ స్నేహాన్ని యువతి కుటుంబసభ్యులు అంగీకరించలేదని పేర్కొన్నాడు. హిందీలో రాసిన ఈ లేఖపై నలుగురు నిందితుల వేలిముద్రలు ఉన్నాయి. ఘటన జరిగిన రోజున తన స్నేహితురాలిని కలవడానికి ఊరు చివర పొలాల్లోకి వెళ్లానని, అక్కడ ఆమె తల్లి, సోదరుడు కూడా ఉన్నారన్నాడు. అక్కడ నుంచి వెళ్లిపోమ్మని తను చెబితే ఇంటికి తిరిగొచ్చేశానని లేఖలో తెలిపాడు.

నాతో స్నేహం చేయడంపై ఆగ్రహించిన యువతి తల్లి, సోదరుడు ఆమెను తీవ్రంగా కొట్టినట్టు గ్రామస్థుల ద్వారా తెలిసిందన్నాడు. ఆమెను నేను ఏం చేయలేదని, ఆమె తల్లి, సోదరులు తనతోపాటు మరో ముగ్గురిపై నిరాధారమైన ఆరోపణలు చేసి జైలుకు పంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు ఏ పాపం తెలియదని, దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని లేఖలో కోరాడు.

నిందితుడు సందీప్ ఠాకూర్ లేఖ రాసిన విషయాన్ని అలీగఢ్ జైలు సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. హథ్రాస్ ఎస్పీకి బుధవారం సాయంత్రం లేఖ రాశాడని తెలిపారు. నిబంధనల ప్రకారం ఆ లేఖను ఎస్పీకి పంపామని అలీగఢ్ జైలు సీనియర్ సూపరింటిండెంట్ అలోక్ సింగ్ పేర్కొన్నారు. అయితే, నిందితుడు చేస్తున్న ఆరోపణలు బాధితురాలి తండ్రి తీవ్రంగా వ్యతిరేకించారు. తాము కుమార్తెను కోల్పోయామని, ఇప్పుడు తమపైనే నిందలు వేస్తున్నారని వాపోయారు. వారు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, తాము ఎటువంటి పరిహారం కోరుకోవడంలేదని, న్యాయం మాత్రమే డిమాండ్ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా, ఆరోపణలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో ఖండించారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా కట్టుకథలు సృష్టించడం, ఆమెపై చేసిన నేరాలకు ఆమెను ఏదో ఒకవిధంగా బాధ్యులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయానికి ఆపవాదును ఆపాదించడానికి ప్రయత్నిస్తున్నారని ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.