యాప్నగరం

ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.. రాజ్యసభలో కీలకం కానున్న వైసీపీ, బీజేడీ.. వారిపైనే ఆశలు పెట్టుకున్న బీజేపీ

బ్యూరోక్రసీ నియంత్రణతో సహా ప్రధాన పాలనా రంగాలపై ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి గల హక్కులను పరిరక్షిస్తూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కేవలం ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అంశం కాదని, రాజ్యాంగ సమాఖ్య పరిధిని కేంద్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నందున ప్రజలందరికీ సంబంధించిన సమస్య అని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 May 2023, 7:24 am

ప్రధానాంశాలు:

  • ఢిల్లీలో పాలనపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు
  • ఎల్జీకి అధికారాలు కట్టబెడుతూ కేంద్రం కీలక ఆర్డినెన్స్
  • రాజ్యసభలో అడ్డుకోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu BJD And YSRCP
ఢిల్లీలో పాలనాధికారం ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వానిదేనని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా నగర పాలనపై సర్వాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ)‌కు కట్టబెడుతూ కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఢిల్లీలో గ్రూప్‌ (ఏ) అధికారుల పోస్టింగ్‌, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను తొలగిస్తూ.. దాని స్థానంలో కొత్తగా నేషనల్‌ క్యాపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీ అనే ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ బిల్లు త్వరలో పార్లమెంట్‌ ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఆర్డినెన్స్‌ను ఉమ్మడిగా కలిసి అడ్డుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాలకు పిలుపునిచ్చారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకుండా చూడాలని ఆయన కోరారు. లోక్‌సభలో బీజేపీకి సొంతంగా మెజార్టీ ఉండటంతో అక్కడ గట్టెక్కినా.. రాజ్యసభలో ఈ ఆర్డినెన్స్ ఆమోదానికి తగినంత మెజార్టీ లేదు. అవసరమైన సంఖ్యా బలం లేకపోయినా.. వైఎస్ఆర్సీపీ, బీజేడీలు మద్దతిస్తాయని కమలదళం ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుతం రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 110 కాగా.. ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్ సీట్లను కలిపితే మరింత పెరుగుతుంది. అయినప్పటికీ, 228 మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా ఎనిమిది తక్కువగా ఉంటుంది. అయితే, ఆ లోటును వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేడీ మద్దతుతో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరాలన్న విపక్షాల పిలుపును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. దీంతో ఉభయ సభల్లోనూ ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లు స్పష్టమైన మెజార్టీతో ఆమోదం పొందుతుందని బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది.

ఈ ఆర్డినెన్స్‌ ఢిల్లీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాజ్యాంగ నిబంధనలను అనుసరించి రూపొందించినట్టు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ అనిల్‌ బలూనీ తెలిపారు. ఉభయ సభల్లోనూ ఎన్డీయేకు సంఖ్యాబలం ఉందని, బిల్లు ఆమోదానికి ఇతర పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆప్ పట్ల శత్రుత్వం, సంఘీభావం మధ్య ఊగిసలాడుతున్న కాంగ్రెస్ కూడా ఈ బిల్లుపై తన వైఖరిని స్పష్టం చేయవలసి ఉంటుంది.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.