యాప్నగరం

వీసాల కోసం ఎగబడ్డ జనం.. పాక్ కాన్సులేట్ వద్ద తొక్కిసలాట.. 15 మంది మృతి

పాకిస్థాన్ వీసాల కోసం భారీ సంఖ్యలో జనం రావడంతో వారిని నిలువరించడం పాకిస్థాన్ రాయబార కార్యాలయం సిబ్బందికి కష్టమయ్యింది. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 21 Oct 2020, 12:14 pm
అఫ్గనిస్థాన్‌లో పాక్ రాయబార కార్యాలయం సమీపంలో తొక్కిసలాట చోటుచేసుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది మహిళలు కావడం బాధాకరం. మంగళవారం సంభవించిన ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. తూర్పు జలాలాబాద్ నగరంలోని పాక్ కాన్సులేట్ వద్దకు వేలాది మంది వీసాల కోసం తరలివచ్చారు. ఈ సందర్భంగా పాక్ వీసా దరఖాస్తుల కోసం టోకెన్లు తీసుకునే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో 11 మంది మహిళలు సహా 15 మంది చనిపోయినట్టు తెలిపారు.
Samayam Telugu పాక్ కాన్సులేట్ వద్ద తొక్కిసలాట


జలాలాబాద్ ప్రావిన్సుల కౌన్సిల్ సభ్యుడు సోహ్రాబ్ ఖాద్రీ మాట్లాడుతూ.. పాక్ వీసా కోసం 3 వేల మందికిపైగా పౌరులు హాజరయ్యారని పేర్కొన్నారు. జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో వారిని అదుపుచేయడంలో భద్రత సిబ్బంది విఫలమయ్యారని అన్నారు. దీంతో అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకుందని తెలిపారు. పాకిస్థాన్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు పొందడానికి టోకెన్లు తీసుకునేందుకు ఎగబడ్డారని, ఈ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుందని ఓ అధికారి వివరించారు. ప్రమాదంతో అప్రమత్తమయిన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా శ్రమించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనపై పాకిస్థాన్ ఎంబసీ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, దీనిపై తక్షణమే స్పందించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.