యాప్నగరం

Bangladesh ఆలయానికి వెళ్తుండగా పడవ ప్రమాదం: 23 మంది జల సమాధి.. పదుల సంఖ్యలో గల్లంతు

పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. పడవలో ఆలయానికి వెళ్తున్న వారు నదిలోనే జల సమాధి అయ్యారు. ఈ ఘటన కరటోనియా నదిలో చోటుచేసుకుంది. మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా పూజల కోసం బయలుదేరి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. బంగ్లా రాజధాని ఢాకాకు 468 కిలోమీటర్ల దూరంలో ఉత్తర పంచగఢ్‌ జిల్లాలోని కరటోనియా నదిలో ఈ పడవ ప్రమాదం చోటుచేసుకుంది. 100 మంది వరకూ పడవలో ఉన్నట్టు సమాచారం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 25 Sep 2022, 6:39 pm

ప్రధానాంశాలు:

  • కరటోనియా నదిలో మునిగిపోయిన పడవ
  • నదీ ప్రయాణాల్లో ఏటా వందల మంది బలి
  • పద్మ నదిలో మే నెలలో ఘోర పడవ ప్రమాదం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
పడవ ప్రయాణం విషాదంగా మారి 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన బంగ్లాదేశ్‌లో (Bangladesh) ఆదివారం సంభవించింది. కరటోయా నదిలో (Karatoya river) పడవ బోల్తా (Boat Capsizes) పడి 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయ్యారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు (Dhaka) 468 కిలోమీటర్ల దూరంలో ఉత్తర పంచగఢ్‌ జిల్లాలోని ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి పడవలో 100 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఉత్తర పంచగఢ్ పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హుటాహుటీనసహాయక బృందాలతో పోలీసులకు అక్కడికి చేరుకున్నారు.
సహాయక చర్యలు చేపట్టి.. ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు బయటకు తీసిన మృతదేహాల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారని ఉత్తర పంచగఢ్‌ జిల్లా పాలనాధికారి జహురుల్‌ ఇస్లాం వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎంత మంది గల్లంతయ్యారనేది స్పష్టత లేదని అన్నారు. 70 మంది వరకూ ఉంటారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక కాలమాన ప్రమాదం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది.

బోడా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి సుజోయ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. బోరోసొషిలో ఉన్న హిందూ ఆలయానికి వెళ్తుండగా కరటోనియా నదిలోని అవాలియా ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. మహాలయ అమావాస్య కావడంతో ఆలయంలో పూజలకు కోసం వెళ్తున్నవారే పడవలో ఎక్కువగా ఉన్నారని చెప్పారు.

కాగా, బంగ్లాదేశ్‌లో ఏటా పడవ ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లోతట్టు ప్రాంతం కావడంతో జల మార్గాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. కానీ, సరైన భద్రతా ప్రమాణాలు పాటించపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఈ ఏడాది మే నెలలో పద్మ (గంగ) నదిలో ఇసుకతో నిండిన బల్క్‌ క్వారియర్‌ను స్పీడ్ బోటు ఢీకొన్న ఘటనలో 26 మంది మృతి చెందారు
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.