యాప్నగరం

చైనాకు చావుదెబ్బ.. ఘర్షణలో 35 మంది సైనికులు మృతి

భారత సైనికులే అక్రమంగా తమ భూభాగంలోకి చొరబడి, దాడికి పాల్పడ్డారని చైనా ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేకాదు, ఈ విషయంలో భారత్ అహంకారం ప్రదర్శించవద్దంటూ నీతులు వల్లిస్తోంది.

Samayam Telugu 17 Jun 2020, 12:54 pm
సరిహద్దుల్లో గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది ఇండియన్ ఆర్మీ సైనికులు అమరులు కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, చైనా మాత్రం తమ సైనికుల ప్రాణనష్టంపై మాత్రం గుంభనంగా ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అమెరికా నిఘా వర్గాల నివేదిక వెల్లడించినట్టు పేర్కొన్నాయి. 35 మంది ప్రాణాలు కోల్పోగా, పెద్ద సంఖ్యలో చైనా సైన్యం కూడా గాయపడినట్టు అమెరికా నిఘా నివేదిక వివరించింది.
Samayam Telugu భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ
India China Border


అయితే, భారత సైనికులే అక్రమంగా తమ భూభాగంలోకి చొరబడి, దాడికి పాల్పడ్డారని చైనా ఆరోపణలు గుప్పిస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి గంభీరంగా ఉందని, భారత్ తన దళాలను అదుపులో ఉంచి, ఏకపక్షంగా వ్యవహరించవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. కానీ, ప్రాణనష్టం గురించి చైనా విదేశాంగ శాఖ ప్రస్తావించకపోవడం గమనార్హం. తీవ్రమైన ఘర్షణ, ప్రాణనష్టం జరిగినట్టు చైనా పీపుల్స్ ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ టాప్ ఎడిటర్ కూడా చైనావైపు ప్రాణనష్టం జరిగినట్టు ధ్రువీకరణ ఉందని చెప్పారు. అయితే, ప్రాణాలు కోల్పోయిన తన సైనికులు సంఖ్యపై మాత్రం చైనా మౌనంగా ఉంది.

సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య నెలకున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్టు అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. ఈ ఏడాది భారత భూభాగంలోకి చొరబాట్లను చైనా ఎందుకు చేపట్టందనేది ఓ పెద్ద ప్రశ్న.. అయితే, దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల కాలంలో చైనా వ్యతిరేక దేశాలతో భారత్‌ు సంబంధాలను మెరుగుపడటం పొరుగు దేశానికి ఇది కొంత కంటగింపుగా మారిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

హాంకాంగ్ వ్యవహారం, ఆర్థిక సంక్షోభం, అమెరికాతో పెరుగుతున్న దూరం వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాల్సిన అవసరం ఉండటంతో చైనా ఈ వ్యూహానికి తెరతీసినట్టు తెలుస్తోంది. భారత్‌ను గందరగోళానికి గురిచేసి, సమతౌల్యతను దెబ్బతీసి, భూభాగాలను ఆక్రమించుకుని అవమానించడం ద్వారా తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న అమెరికా సహా ఇతర దేశాలకు బలమైన సంకేతాలు పంపేందుకు ఇలాంటి చర్యలు చేపట్టంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.