యాప్నగరం

పాక్‌‌ను వణికించిన భూకంపం.. 9 మంది మృతి.. 160 మందికి గాయాలు

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్ పర్వతాల్లో మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం కారణంగా అఫ్గన్‌తో పాటు భారత్, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో ఫ్యాన్లు, డైనింగ్ టేబుళ్ల మీద ఉన్న వస్తువులు భూకంపం దాటికి కదిలాయి. ప్రజలు ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 Mar 2023, 10:59 am

ప్రధానాంశాలు:

  • హిందూకుష్ పర్వతాల సమీపంలో భూకంపం
  • రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతగా నమోదయినట్టు ప్రకటన
  • పాక్‌లో భారీగా నష్టం ఉంటుందని అంచనా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Earthquake
మంగళవారం రాత్రి సంభవించిన భూకంపానికి పాకిస్థాన్‌లో ఇప్పటి వరకూ 9 మంది మృతిచెందగా.. మరో 160 మంది వరకూ గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.5‌గా నమోదుకాగా.. అఫ్గనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలోని 180 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు పాకిస్థాన్ వాతావరణ విభాగం తెలిపింది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహత్, లక్కీ మర్వాట్ సహా పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. గుజ్రన్‌వాలా, గుజరాత్, సియాల్‌కోట్, కోట్ మోమిన్, మధ్ రంఝా, చాక్‌వాల్, కోహట్, గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం తర్వాత జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు పెడుతున్న వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారమవుతున్నాయి.
భూకంప మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని, చాలా వరకూ భవనాలు నేలమట్టమయ్యాయని జియో న్యూస్ తెలిపింది. భూకంప సమయంలో రావల్పిండి మార్కెట్లలో తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు ది ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ తెలిపింది. మరోవైపు, ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనడానికైనా సిద్ధంగా ఉండాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులను పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అప్రమత్తం చేశారు. అటు, పాక్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ సూచనలతో ఇస్లామాబాద్‌లోని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

అంతర్జాతీయ సీస్మాలాజికల్ కేంద్రం ప్రకారం.. పాకిస్థాన్‌తో పాటు భారత్, అఫ్గనిస్థాన్, తుర్కిమెనిస్థాన్, కజిఖిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిజిస్థాన్‌లో భూప్రకంపనలు నమోదయ్యాయి. పాక్‌లో భూకంపాలు సర్వసాధారణం. ఈ ఏడాది జనవరిలో 6.3 తీవ్రతతో భూకంపం నమోదయ్యింది. 2005లో సంభవించిన భూకంపానికి పాకిస్థాన్‌లో 74 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్ చరిత్రలోనే ఇదే అత్యంత భారీ ప్రాణనష్టం కలిగించిన భూకంపంగా నిలిచిపోయింది.


Read More Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.