యాప్నగరం

China Spy Ship నిన్న శ్రీలంకకు గూఢచర్య నౌక.. నేడు పాక్‌కు సైన్యాలు పంపుతోన్న చైనా

China Pakistan Economic Corridor కోసం చైనా బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సాగుతున్న ఈ మార్గంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని భావిస్తోన్న డ్రాగన్.. తన బలగాలను ప్రత్యేకంగా అక్కడ నియమించాలని ప్రయత్నాలు చేపట్టింది. ఇందుకు పాక్‌కు నయానో భయానో ఒప్పించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో పాక్-అఫ్గన్ సంఘర్షణ ప్రాంతంలో తన స్వంత బలగాలను మోహరించడం ద్వారా రెండు దేశాలలో తన ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తోంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 17 Aug 2022, 3:19 pm

ప్రధానాంశాలు:

  • ఒన్ బెల్ట్ ఒన్ రోడ్డులో భాగంగా భారీ పెట్టుబడులు.
  • అఫ్గన్, పాకిస్థాన్ మార్గంలో వ్యూహాత్మకంగా పావులు.
  • గ్వాదర్ పోర్టుపై పట్టుకోసం చైనా కుయుక్తులు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పాక్‌లో చైనా సైనిక అవుట్‌‌పోస్టులు
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒన్ బెల్ట్ అండ్ ఒన్ రోడ్ ఇనీషియేటివ్‌లో (One Belt One Road Initiative) భాగంగా పాకిస్థాన్- అఫ్గనిస్థాన్ సంఘర్షణ రీజియన్‌లో (Pakistan Afghanistan) చైనా గణనీయమైన పెట్టుబడులను పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన అవుట్‌పోస్టులలో (China Outposts) తన స్వంత బలగాలను మోహరించడం ద్వారా రెండు దేశాలలో తన ప్రయోజనాలను కాపాడుకోవాలని చైనా యోచిస్తోందని సీనియర్ దౌత్య వర్గాల సమాచారం. పాక్-అఫ్గన్ మార్గం గుండా మధ్య ఆసియాలో తన పలుకుబడిని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ రెండు దేశాల్లో వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం గమనార్హం.
మరోవైపు, భారత్ ఆందోళనలను ఏ మాత్రం పట్టించుకోకుండా చైనా గూఢచర్య నౌక (China Spy Ship) శ్రీలంకలోని హంబన్‌టోట (Hambantota) పోర్టుకు మంగళవారం ఉదయం చేరుకున్న విషయం తెలిసిందే. చైనామీద ఎక్కువగా ఆధారపడుతున్న పాకిస్థాన్‌లో డ్రాగన్ 60 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా సైనిక, దౌత్యపరమైన సహకారం కూడా అందుతోంది. దీంతో పాక్‌లోని రాజకీయ అస్థిరతను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు చేస్తున్న చైనా.. తన సైనిక బలగాల అవుట్‌పోస్ట్‌ల నిర్మాణం కోసం ఒత్తిడి తీసుకొస్తోంది.

అయితే, ప్రస్తుతం తాలిబన్ల పాలనలో (Taliban) ఉన్న అఫ్గనిస్థాన్.. అనేక అంశాలలో చైనా, పాక్ అంచనాలను ఇంకా అందుకోలేకపోయింది. ఒన్ బెల్ట్ ఒన్ రోడ్ ఇనీషియేటివ్‌కు అఫ్గన్, పాకిస్థాన్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగేందుకు యుద్ధ ప్రాతిపదికన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పనిచేస్తోందని పాక్‌కు చెందిన దౌత్య, సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విషయమై చర్చించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif), విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto), ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాల (Pakistan Army Chief Qamar Javed Bajwa) తో పాక్‌లో చైనా రాయబారి నాంగ్ రోంగ్ సమావేశాలు నిర్వహించారని తెలిపాయి. మార్చి చివరి వారంలో చైనాకు వెళ్లిపోయిన నాంగ్ రోంగ్.. ఇటీవలే తమ దేశానికి వచ్చినట్టు చెప్పాయి. కొత్త ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన తొలి అధికారిక సమావేశంలో చైనా బలగాల అవుట్‌పోస్ట్‌ల ఏర్పాటుపై నాంగ్ రోంగ్ డిమాండ్ వినిపించినట్టు వివరించాయి.

చైనా ప్రాజెక్టులతో పాటు తమ పౌరుల భద్రతపై నిరంతరం పట్టుబడుతున్నారని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. చైనా ఇప్పటికే గ్వాదర్‌లో భద్రతా ఔట్‌పోస్ట్‌లు, గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తన యుద్ధ విమానాల కోసం ఉపయోగించాలని డిమాండ్ చేసింది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.