యాప్నగరం

థాయ్ గుహ: రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. ఆ 13 మంది సురక్షితం!

థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో బందీలైన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్ కోచ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.

Samayam Telugu 27 Dec 2018, 6:29 pm
ప్రపంచ ప్రార్థనలు ఫలించాయి. థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలో బందీలైన 12 మంది చిన్నారులు, ఫుట్‌బాల్ కోచ్‌‌ను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి. గుహలో ఉన్న మిగతా నలుగురు చిన్నారులు, కోచ్‌ను మంగళవారం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో థాయ్‌లాండ్‌లో సంబరాలు మిన్నంటాయి.
Samayam Telugu sssdz


గుహలో చిక్కుకున్న 13 మందిని దశలవారీగా బయటకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం నలుగురు చిన్నారులను బయటకు తీసుకురాగా, సోమవారం మరో నలుగురు చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. మంగళవారం కూడా వాతావరణం సహకరించడంతో మిగతా కోచ్‌తో సహా మిగతా నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని థాయ్ నేవీ సీల్స్ ధృవీకరించింది.

Also Read: గుహ నుంచి ఇలా బయటకు తీసుకొచ్చారు
గుహ నుంచి బయటపడిన చిన్నారులకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు చేరిన 13 మందిని థాయ్‌లాండ్ ప్రధానమంత్రి ప్రయుత్ చన్ ఓచా కలిసినట్లు తెలిసింది.

ఇలా చిక్కుకున్నారు: ఫుట్‌బాల్ టీమ్ కోచ్.. తన జూనియర్ టీమ్ సభ్యులతో కలిసి జూన్ 23న సైక్లింగ్ చేసుకుంటూ ఈ గుహల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తుండంతో గుహలోపలికి వెళ్లారు. గుహ ప్రవేశమార్గం మొత్తం నీటితో నిండిపోవడంతో సురక్షిత ప్రాంతంలో తలదాచుకునేందుకు వారంతా గుహ లోపలకి వెళ్లడం మొదలుపెట్టారు. గుహలో దాదాపు నాలుగు కిలోమీటర్లు లోపలికి చేరుకున్నారు. ఆ తర్వాత వరద బాగా పెరిగి గుహలో భారీగా నీరు చేరింది. దీంతో వారు బయటకు రాలేకపోయారు.

Also Read: ఆ గుహ ఎందుకంత ప్రమాదకరం?

నాలుగు నెలలు కాదు.. 3 రోజుల్లోనే తీసుకొచ్చేశారు:
వాళ్లంతా దాదాపు 9 రోజులు ఆ చీకటి గుహలో కనీసం ఆహారం కూడా లేకుండా గడిపారు. నీటి మట్టం తగ్గకపోయేసరికి అందులోనే బందీలయ్యారు. బ్రిటన్ నుంచి వచ్చిన రిక్ స్టేషన్, జాన్ ఒలంథేన్‌లు వీరి కోసం గుహను జల్లెడపట్టి ఆచూకీ కనుగొన్నారు. చిన్నారులను బయటకు తీసుకొచ్చేందుకు తొలుత 4 నెలల సమయం పడుతుందని భావించినా.. కేవలం 3 రోజుల్లోనే సురక్షితంగా బయటకు తీసుకురాగలగడం నిజంగా అద్భుతం.

సంతోషమే, కానీ..: 13 మంది ప్రాణాలతో బయటపడటంతో ప్రపంచంమంతా సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే, వీరిని కాపాడే ప్రయత్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. థాయ్ మాజీ నావీ సీల్ డైవర్ సమ్రాన్ పూనన్.. గుహలో చిన్నారులు చిక్కుకున్నారని తెలియగానే.. వారిని రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. రెస్క్యూటీమ్‌తో కలిసి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. చిన్నారుల వద్దకు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లి.. తిరిగి వస్తున్న సమయంలో గుహలో ఊపిరి అందక మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.