యాప్నగరం

ఆ ఉగ్రవాదిని పట్టిస్తే రూ.75 కోట్ల నజరానా.. అమెరికా కీలక ప్రకటన

ఇరాక్‌పై అమెరికా దాడి తర్వాత 2003లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రారంభమైంది. తాము అన్నింటినీ కోల్పోయామని, షియాల ఆధిపత్యం పెరిగిపోతోందని అప్పట్లో ఇరాక్‌లోని సున్నీ ముస్లిం వర్గం భావించడమే దీని ఏర్పాటు వెనక కారణం.

Samayam Telugu 26 Jun 2020, 9:07 am
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్, సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ చీఫ్ అల్ బాగ్దాదీ ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత గతేడాది అక్టోబరులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐసిస్ కొత్త నేతగా అమిర్ మొహమ్మద్ సైద్ అబ్దుల్ రహ్మాన్ అల్-మావలా బాధ్యతలు చేపట్టాడు. దీంతో, అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. తాజాగా, అబ్దుల్‌ రహ్మన్‌ అల్‌-మావలా ఆచూకీ చెబితే పది మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.75 కోట్లు) నజరానా ఇస్తామని అమెరికా ప్రకటించింది.
Samayam Telugu ఐఎస్ ఉగ్రవాద సంస్థ కొత్త చీఫ్
US Announced Reward on IS New Chief


గతంలో అమిర్‌ మొహమ్మద్‌ ఆచూకీ చెబితే ఐదు మిలియన్‌ డాలర్లు రివార్డు ఇస్తామన్న అమెరికా ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 18న అమిర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ‘రివార్డు రెట్టింపు చేయడం.. ఐసిస్‌ వ్యతిరేక పోరాటంలో కీలకమైన ఘట్టం. ఇప్పటికే యుద్ధంలో ఐసిస్‌ ఓడిపోయింది. అయితే ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను గుర్తించాలి. మూలాల్ని దెబ్బకొట్టాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అమిర్ మొహమ్మద్.. 1976లో ఇరాక్‌లోని మోసూల్‌లో జన్మించాడు. అల్-మావ్లా ఐసిస్ మునుపటి సంస్థ అల్-ఖైదా ఇరాక్ విభాగంలో సీనియర్ ఉగ్రవాది. తర్వాత ఐసిస్ డిప్యూటీ లీడర్‌గా ఎదిగి, అబూ బకర్ అల్ బాగ్దాదీ చనిపోయిన తర్వాత చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ‘ఐసిస్ అత్యంత సీనియర్ సిద్ధాంతకర్తలలో ఒకడైన అల్-మావల వాయువ్య ఇరాక్‌లోని మైనారిటీలు యాజిద్‌లను అపహరించడం, హత్యచేయడం, అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా పాల్పడ్డాడు’ అని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

మోస్ట్ వాంటెడ్ ఐసిస్ చీఫ్ అల్ బాగ్దాదీని పట్టుకోడానికి అమెరికా సైన్యం సిరియాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో భాగంగా అతడు స్థావరాన్ని గుర్తించి, అక్కడకు అమెరికా ప్రత్యేక దళాలు చేరుకోవడంతో వారికి చిక్కకుండా బలవన్మరణానికి పాల్పడ్డాడని ట్రంప్ ప్రకటించారు. 2014లో ప్రపంచవ్యాప్తంగా బాగ్దాదీ పేరు వార్తల్లో నిలిచింది. ఇరాక్, సిరియాలో ఖలీఫా సామ్రాజ్యం ఏర్పాటుచేస్తానని ప్రకటించాడు. కొత్త ఉగ్రవాద సంస్థను స్థాపించి వేలాది మందిని హతమార్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.