యాప్నగరం

కంటతడి పెట్టిన బరాక్ ఒబామా

ఏనిమిదేళ్లుగా అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన బరాక్ ఒబామా దేశ ప్రజలకు ఉద్వేగభరిత వీడ్కోలు పలికారు.

TNN 12 Jan 2017, 7:15 am
ఎనిమిదేళ్లు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన బరాక్ ఒబామా దేశ ప్రజలకు ఉద్వేగభరిత వీడ్కోలు పలికారు. అధ్యక్షుడి హోదాలో మంగళవారం చికాగోలో జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశారు. జాతి వివక్ష, అసమానతలతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని, వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికాలో ఉన్న ముస్లింల పట్ల వివక్ష చూపడం సరికాదని, దానికి తాను పూర్తి వ్యతిరేకినని తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Samayam Telugu barack obama makes final speech as us president in chicago
కంటతడి పెట్టిన బరాక్ ఒబామా


దేశంలో నల్లజాతీయులపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉందని ఒబామా ఉద్ఘాటించారు. నల్లజాతీయుడినైన తాను 2008లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు.. జాతి వివక్ష లేని కాలంలోకి అమెరికా అడుగుపెట్టందని అంతా చర్చించుకున్నారని, కానీ ఇప్పటికీ అది వాస్తవ రూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ అంతం కాక తప్పదని, అమెరికాకు చెడు తలపెట్టాలనుకునేవారెవ్వరూ సురక్షితంగా ఉండలేరని హెచ్చరించారు.

కాగా, వీడ్కోలు ప్రసంగంలో తన భార్య మిచెల్‌కు ఒబామా ధన్యవాదాలు తెలిపారు. మిచెల్ తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, గత 25 ఏళ్లుగా పిల్లల్ని, తనని కంటికి రెప్పలా కాపాడిందని కొనియాడారు. దీంతో మిచెల్‌తోపాటు ఒబామా ఇకుమార్తె మాలియా ఉద్వేగానికి గురయ్యారు. ప్రసంగం ముగింపులో ఉద్వేగానికి గురైన ఒబామా.. మళ్లీ అధ్యక్షుడిగా మీరే రావాలని ఆహుతులు కోరడంతో కంటతడి పెట్టారు. ఒబామా సొంత పట్టణమైన చికాగోలో ఏర్పాటుచేసిన ఈ సభకు దాదాపు 20 వేల మంది మద్దతుదారులు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.