యాప్నగరం

చైనాకు దిమ్మతిరిగే షాకిచ్చిన థాయ్‌లాండ్.. కొనసాగనున్న ‘మలక్కా డైలమా’.. భారత్ ఫుల్ ఖుషీ!

చైనా 70 ఏళ్ల కలల ప్రాజెక్టుకు థాయ్‌లాండ్ తూట్లు పొడించింది. మలక్కా జలసంధితో పనిలేకుండా తలపెట్టాలని భావించి క్రా కెనాల్ ప్రాజెక్టును థాయ్‌లాండ్ పక్కనబెట్టింది.

Samayam Telugu 4 Sep 2020, 3:13 pm
భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న వేళ.. డ్రాగన్‌కు థాయ్‌లాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తమ దేశ భూభాగం మీదుగా వెళ్లే ‘క్రా కెనాల్ ప్రాజెక్ట్‌’ను రద్దు చేస్తున్నట్లు థాయ్‌లాండ్ ప్రకటించింది. గల్ఫ్ దేశాల నుంచి హిందూ మహాసముద్రం మీదుగా రవాణా కోసం ఇప్పటి వరకూ మలక్కా జలసంధిపై ఆధారపడుతోంది. చైనా చమురు దిగుమతులు, వస్తు రవాణాలో అధిక భాగం ఈ జలసంధి మీదుగానే వెళ్తోంది. ఈ ఇరుకైన జలసంధికి ఓవైపు మలేసియా, సింగపూర్ ఉన్న మలై ద్వీపకల్పం ఉంటే... మరోవైపు ఇండోనేసియాలోని సుమత్రా దీవి ఉంటుంది.
Samayam Telugu Malacca Strait: Google Map


మలక్కా జలసంధి భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవులకు అతి చేరువలో ఉంటుంది. చైనా తోక జాడిస్తే.. భారత నౌకాదళం మలక్కా ప్రాంతం దగ్గర చైనాను ఇబ్బంది పెట్టగలదు. దీని బదులుగా థాయ్‌లాండ్ భూభాగం మీదుగా కాలువ తవ్వడం ద్వారా.. మలక్కా జలసంధి నుంచి వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని చైనా భావించింది.

బ్యాంకాక్‌కు దక్షిణాన 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలయ్ ద్వీపకల్పాన్ని రెండుగా చీలుస్తూ.. థాయ్‌లాండ్ గల్ఫ్‌ను, అండమాన్ సముద్రంతో అనుసంధానించేలా 120 కిలోమీట్లర పొడవున కాలువ తవ్వాలని చైనా ప్రతిపాదించింది. 70 ఏళ్ల నాటి ఈ ప్రతిపాదనను ఈసారి ఎలాగైనా పట్టాలెక్కించాలని చైనా భావించింది. థాయ్‌లాండ్‌లోని శక్తివంతమైన వ్యక్తులకు భారీగా డబ్బు ఆశ చూపింది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గుతున్నట్లు థాయ్‌లాండ్ ప్రకటించింది. అంతేకాదు 724 మిలియన్ డాలర్లతో చైనా నుంచి రెండు సబ్‌మెరైన్లను కొనుగోలు ప్రతిపాదనను సైతం థాయ్‌లాండ్ వాయిదా వేసింది.
థాయ్ కాలువ నిర్మాణం పూర్తయితే.. హిందూ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్య చైనా నౌకలు ప్రయాణించడం సులువు అవుతుంది. మలక్కా సంధి మీదుగా 1000 కి.మీ. దూరం అదనంగా తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది. కానీ ఈ కాలువ నిర్మాణం ఆర్థికంగా, రాజకీయం తమకు లబ్ధి చేకూర్చదని థాయ్‌లాండ్ భావించింది. సూయజ్, పనామా కాలువల వల్ల చాలా సమయం, ఇంధనం ఆదా అవుతోంది.

Read Also: 30 రోజుల తర్వాత శిథిలాల కింద సజీవంగా..

కానీ మలక్కాకు ప్రత్యామ్నాయంగా భావించే క్రె కెనాల్ ద్వారా వచ్చే ఆదాయం పరిమితంగా ఉంటుంది. నిర్మాణ వ్యయంతో పోలిస్తే.. వచ్చే ఆదాయం తక్కువ. ఇది భారత్, అమెరికా దేశాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. భారత్ అండమాన్ దీవులను ఆధునికీరిస్తోంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ కాలువ వల్ల థాయ్‌లాండ్ ఉనికే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. ఈ కాలువకు సమీపంలోని మయన్మార్, కంబోడియా లాంటి దేశాల్లో చైనా జోక్యం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో థాయ్‌లాండ్ వెనక్కి తగ్గింది. క్రె కెనాల్ ప్రతిపాదనను థాయ్ డస్ట్ బిన్లో పడేయడంతో.. చైనాకు మలక్కా డైలమా కొనసాగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.