యాప్నగరం

చైనా: దలైలామాను అడ్డుపెట్టుకుంటే మూల్యం తప్పదు!

సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో బౌద్ధమత గురువు దలైలామా పర్యటనకు సహకరించిందంటూ భారత్‌పై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది.

TNN 21 Apr 2017, 6:39 pm
Samayam Telugu china india will pay dearly if it keeps playing the dalai lama card
చైనా: దలైలామాను అడ్డుపెట్టుకుంటే మూల్యం తప్పదు!
సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో బౌద్ధమత గురువు దలైలామా పర్యటనకు సహకరించిందంటూ భారత్‌పై చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. దలైలామాను అడ్డుపెట్టుకుని లబ్ది పొందాలని చూస్తే భారత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అరు ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ కొత్త పేర్లను ప్రకటించిన చైనా వైఖరిని భారత్ ఇప్పటికే తప్పుబట్టింది. దలైలామా చెప్పినందు వల్లే ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ తమదిగా ఇండియా భావిస్తోందంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ విదేశాంగ విధానం గురించి సంపాదకీయాన్ని ప్రచురించింది.

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 90 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో అనేక ప్రాంతాలు తమవేనంటూ చైనా పేర్కొంటోంది. దీన్ని ఆ దేశం దక్షిణ టిబెట్‌గా ప్రకటిస్తోంది. రెండు రోజుల కిందటే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా అధికారికంగా ప్రకటించింది. దలైలామాను అడ్డుపెట్టుకుని మరో కొత్త వంచనకు తెరతీసిన భారత్ అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా అధికారింగా కొత్త పేర్లను ఎందుకు ప్రకటించిందో ఇప్పటికైనా ఆలోచించాలని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

ఇది భారత్‌ వైఖరికి తెలివైన మార్గం కాదని, ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కథనంలో పేర్కొంది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోడానికి చైనా ప్రయత్నిస్తున్నా భారత్ ఆసక్తి చూపడం లేదంటూ కూడా ఆరోపణలు చేసింది. తన బలంతో చైనాను అడ్డుకోవాలని మొండిగా వ్యవహరిస్తోంది, కానీ ఏది ఎక్కువ, ఏది తక్కువ అనే అంశం ద్వారా ప్రాదేశిక వివాదాలను పరిష్కరించలేమని సలహా ఇచ్చింది. లేకపోతే సంప్రదింపులు చేయాల్సిన అవసరం చైనాకు లేదంటూ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.