యాప్నగరం

Covid-19 చైనాలో రోజుకు మిలియన్ కేసులు, 5 వేల మరణాలు.. జనవరికి 3.7 మిలియన్లకు చేరే ఛాన్స్!

Covid-19 కరోనా వైరస్ వ్యాప్తిలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయినా.. ఇంకా ముప్పు మాత్రం తొలగిపోలేదు. మహమ్మారి అత్యవసర స్థితి దశ ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటే అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో కరోనా వైరస్‌ విజృంభణ వినాశకర స్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కొవిడ్‌ ముగిసిపోలేదనే విషయం స్పష్టమవుతోందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శాస్త్రవేత్తలూ ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 Dec 2022, 3:09 pm

ప్రధానాంశాలు:

  • చైనాలో విజృంభణతో కరోనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ
  • జనవరిలో రోజుకు 3.7 మిలియన్లు దాటే ఛాన్స్.
  • ప్రపంచం ఇంత వరకూ చూడని విలయం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu China Cases
Covid-19 కరోనా కరాళనృత్యానికి చైనా విలవిలలాడుతోంది. జీరో కోవిడ్ ఆంక్షలను సడలించిన తర్వా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. అక్కడ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా విశ్లేషణ ప్రకారం.. చైనాలో రోజుకు 10 లక్షల కేసులు, 5000 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. కరోనా మొదలైన తర్వాత ప్రపంచం ఇంత వరకూ చూడని విలయాన్ని చైనా ఎదుర్కోనుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత వేవ్ కారణంగా జనవరిలో రోజువారీ కేసులు 3.7 మిలియన్లకు పెరగొచ్చని బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ ఎనలిటిక్స్ తెలిపింది. మార్చిలో రోజువారీ గరిష్ట స్థాయి 4.2 మిలియన్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైన కథనం ప్రకారం చైనాలో నిబంధనలను సడలించిన తర్వాత 13లక్షల నుంచి 21లక్షల మంది వరకు మృత్యువాత పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
అటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథ్నామ్ ఘ్యాబ్రియోసిస్ బుధవారం మాట్లాడుతూ... చైనాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందన్న నివేదికలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘చైనాలో కోవిడ్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని వస్తున్న నివేదికలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది.. వైరస్ బారినపడే అవకాశాలున్న వారిని గుర్తించి టీకాలు ఇచ్చేందుకు చైనా తీసుకొనే చర్యలకు మేము సాయం అందిస్తాం.. వైద్య, ఆరోగ్య వ్యవస్థల రక్షణకు మా మద్దతు కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు.

డబ్య్యూహెచ్ఓ ఎమర్జెన్సీస్‌ విభాగం చీఫ్‌ మైఖెల్‌ ర్యాన్‌ మాట్లాడుతూ ‘‘అత్యంత వేగంగా వ్యాపించే వైరస్‌ను ప్రజా వైద్య సౌకర్యాలు, సామాజిక నియంత్రణతో అడ్డుకోవడం కష్టమని కొన్ని వారాల ముందే హెచ్చరించాం.. అయినా చాలా దేశాలు తమ హెచ్చరికలను పట్టించుకోకుండా మిశ్రమ వ్యూహానికి మారాయి. ఒమిక్రాన్‌ ప్రభావం నుంచి తప్పించుకొనే వ్యూహం వ్యాక్సిన్లు మాత్రమే’’ అని పేర్కొన్నారు.

కాగా, కరోనా వైరస్ మొదలైప్పటి నుంచి చైనా జీరో కోవిడ్ వ్యూహాన్నే నమ్ముకుంది. నెలలుగా కఠిన కోవిడ్ ఆంక్షలతో విసిగిపోయిన జనం.. ఆందోళనలు, నిరసనలు చేపట్టడంతో ఇటీవలే నిబంధనలు సడలించింది. అప్పటి నుంచి వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ కారణంగా శ్వాసకోశ వైఫల్యంతో మరణించిన వారిని మాత్రమే ఇప్పుడు కోవిడ్ మరణ గణాంకాల కింద లెక్కించనున్నట్లు చైనా అధికారులు మంగళవారం తెలిపారు.

వైరస్ మరణాలను నమోదు చేయడానికి ప్రమాణాలలో మార్పు అంటే చాలా మంది ఇకపై లెక్కల్లోకి రారు. కోవిడ్ -19 తో ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని చైనా బుధవారం వెల్లడించడం గమనార్హం.

Read Latest International News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.