యాప్నగరం

కరువు హెచ్చరిక జారీ చేసిన చైనా.. ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు

చైనాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సగం భూభాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 66 నదులు ఎండిపోయాయి. కొండలు, అడవుల్లో తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 19 Aug 2022, 12:52 pm
మండుతున్న ఎండలు, వడగాల్పులు, కరువు పరిస్థితులతో చైనా విలవిల్లాడుతోంది. దీంతో ఈ ఏడాది తొలి కరువు హెచ్చరికను చైనా జారీ చేసింది. దావాగ్నిని అరికట్టడం కోసం, యాంగ్జై నది పరివాహక ప్రాంతం వెంబడి తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి పంటలను రక్షించుకోవడం కోసం ప్రత్యేక బృందాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం రాత్రి చైనాలో ‘ఎల్లో అలర్ట్’ జారీ చేశారు. నైరుతి దిశలోని సిచువాన్ నుంచి యాంగ్జై డెల్టాలోని షాంఘై వరకు కొద్ది వారాలుగా తీవ్రమైన వేడి వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పులే దీనికి కారణమని అధికారులు పదే పదే చెబుతున్నారు.
Samayam Telugu China Flag
China Flag


చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌లోని పొయాంగ్ సరస్సు ఏటా ఈ సమయంలో ఉండే పరిమాణంతో పోలిస్తే.. నీటి లభ్యత తగ్గడంతో 25 శాతానికి తగ్గిపోయిందని చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా వెల్లడించింది. చాంగ్‌కింగ్ నైరుతి ప్రాంతంలోని 34 కౌంటీల్లోని 66 నదులు ఎండిపోయాయని సీసీటీవీ తెలిపింది. చాంగ్‌కింగ్ ప్రాంతంలో ఈ ఏడాది 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. చాలా జిల్లాల్లో నేల తేమను కోల్పోయిందని సీసీటీవీ వెల్లడించింది.

బియ్‌బియ్ జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం చైనాలో నమోదైన పది అత్యంత వేడి ప్రాంతాల్లో ఆరు చాంగ్‌కింగ్ ప్రాంతంలోనే ఉన్నాయి. బిషాన్, షాంఘైల్లో ఎండ వేడి అధికంగా ఉంది.

చాంగ్‌కింగ్ ఏరియాలోని కొండ ప్రాంతాలు, అడవుల్లో తరచుగా మంటలు వ్యాపిస్తుండటంతో వాటిని అరికట్టడం కోసం అగ్నిమాపక సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.

తీవ్రమైన ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో.. ఫులింగ్ జిల్లాలోని వినియోగదారులకు గ్యాస్ సరఫరాను తదుపరి సమాచారం ఇచ్చేంత వరకు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దెబ్బతినే అవకాశం ఉన్న పంటలను కాపాడటం కోసం చాంగ్‌కింగ్ అగ్రికల్చరల్ బ్యూరో నిపుణుల బృందాలను ఏర్పాటు చేసింది.

జులై నెలలో నమోదైన అధిక ఉష్ణోగ్రతల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ నేరుగా 2.73 బిలియన్ యువాన్లు (400 మిలియన్ డాలర్లు) నష్టపోయింది. 55 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. చైనాలో తీవ్ర వడగాలులు వీస్తుండగా... ఆగస్టు 26 తర్వాతే ఇవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

చైనాలోని 45 లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగంలో.. గత నెల రోజులకుపైగా.. 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని దేశంలోని సగం భూభాగంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చైనా వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.