యాప్నగరం

చైనాలో ఇమ్రాన్ ఖాన్.. కశ్మీర్ అంశంలో పాక్‌కు డ్రాగన్ ఝలక్!

కశ్మీర్ విషయంలో తన చిరకాల మిత్రుడు మద్దతుగా ఉంటాడని భావించిన పాకిస్థాన్‌కు అక్కడ కూడా నిరాశ తప్పలేదు. ఈ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

Samayam Telugu 9 Oct 2019, 10:48 am
కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ వాదనకు చైనా వంతపాడిన విషయం తెలిసిందే. కానీ, వారం రోజుల్లో తన స్టాండ్ మార్చుకున్న డ్రాగన్.. తమ దేశంలో పర్యటిస్తోన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఝలక్ ఇచ్చింది. కశ్మీర్ అంశాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత్, పాకిస్థాన్‌లు కశ్మీర్ సహా అన్ని వివాదాలను పరస్పర అవగాహనకు వచ్చి ద్వైపాక్షిక చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుంగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచ దేశాలన్నీ ఇదే కోరుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో డ్రాగన్ ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Samayam Telugu jijing


అక్టోబరు 11 నుంచి 13 వరకు భారత్‌లో పర్యటించే జింగ్‌పింగ్.. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఇందుకు తమిళనాడు తీరదేవాలయం మహాబలిపురం వేదిక కానుంది. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370, 35లను భారత్ రద్దుచేసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో డ్రాగన్ ఈ ప్రకటన చేయడం విశేషం. ఇటీవల ఐరాస సర్వప్రతినిధుల సభలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. కశ్మీర్‌ అంశం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా కొనసాగుతోన్న వివాదమని అభివర్ణించారు. ఐరాస నియమావళి, ద్వైపాక్షిక ఒప్పందం, భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

అయితే, దీనికి భిన్నంగా మంగళవారం ప్రకటన ఉండటం గమనార్హం. కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్థాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆగస్టు 5 కి ముందు ఉన్న స్థితిని పునరుద్దరించడానికి సిద్ధంగా ఉన్నట్టు చైనా తాజా ప్రకటనతో సూచనలు ఇచ్చింది. యుఎన్ చార్టర్, సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాల సూచనలను భారత్ విస్మరించిందని వాదిస్తోన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాలు చైనాలో పర్యటిస్తున్న వేళ డ్రాగన్ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.

కశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించబోమని భారత్ తెగేసిచెప్పడంతో చైనా తన విధానాన్ని మార్చుకుంది. అయితే, జింగ్‌పింగ్ భారత పర్యటన విజయవంతం కావాలంటే కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వకపోవడమే ఉత్తమమని చైనా భావిస్తోన్నట్టు తెలుస్తోంది. అలాగే, తన వైఖరిని మార్చుకోవడం ద్వారా కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌ వెనక్కు తగ్గించే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్ సమస్యపై భారత్‌ కరాఖండిగా చెప్పడంతో చైనా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు దాని ప్రకటనతో అవగతమవుతోంది. ఇక, చైనా అధ్యక్షుడి భారత పర్యటన గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనికి సంబంధించి బుధవారం మీడియా సమావేశంలో వెళ్లడించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.