యాప్నగరం

గాల్వన్ లోయ ఘర్షణ: చైనా తీరును ఎండగట్టిన అమెరికా

సరిహద్దుల్లో పొరుగుదేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరును అగ్రరాజ్యం ఎండగట్టింది. ఇలాంటి చర్యలకు పాల్పడటం డ్రాగన్‌కు కొత్తేంకాదని, కోవిడ్ సంక్షోభంలో ప్రపంచం ఉండగా దుస్సాహసాలకు ఒడిగడుతోందని మండిపడింది.

Samayam Telugu 19 Jun 2020, 3:43 pm
భారత సరిహద్దుల్లో చైనా దురాగతాలను అగ్రరాజ్యం అమెరికా తూర్పారబట్టింది. ప్రపంచమంతా కొవిడ్‌పై దృష్టి సారించిందని భావించిన చైనా ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడుతోందని దుయ్యబట్టింది. భారత సరిహద్దుల్లో చైనా కుట్రలను అధ్యక్షుడు ట్రంప్‌ పాలకవర్గం నిశితంగా గమనిస్తోందని విదేశాంగ శాఖ తూర్పు ఆసియా, పసిఫిక్ వ్యవహారాల అసిస్టెంట్ సెక్రెటరీ డేవిడ్‌ స్టిల్‌వెల్‌ మరోసారి పునరుద్ఘాటించారు. గతంలో డోక్లాంలోనూ డ్రాగన్‌ ఇదే తరహా కుయుక్తులకు పాల్పడిందని గుర్తుచేశారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న తరుణంలో చైనా ఇదే అదునుగా భావించి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Samayam Telugu గాల్వన్ లోయ ఘర్షణపై అమెరికా స్పందన
US on India China Border Row


పొరుగుదేశాలతో సరిహద్దుల్లో చైనా వ్యవహరించే తీరుపై తమ వైఖరిని ఇప్పుడే ప్రకటించలేదని, గతంలోనూ ఇలాంటి సరిహద్దు వివాదాలు తలెత్తాయని స్టిల్‌వెల్‌ వ్యాఖ్యానించారు. తొలిసారి చైనా అధ్యక్షుడు 2015లో భారత్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ఘటన జరిగిందని పేర్కొన్నారు. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) వివాదాస్పద ప్రాంతంలోని చాలా లోపలికి చొచ్చుకెళ్లిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా సైన్యాన్ని మోహరించిందని తెలిపారు.

అయితే, చైనా ఇలా ఎందుకు చేసిందన్న దానిపై మాత్రం స్పష్టత లేదన్నారు. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం లేదా వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా ఇలా చేసి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై నిశితంగా గమనిస్తున్నామని అన్నారు. భారత్‌, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్‌, వాణిజ్య ఒప్పందాలు, కరోనా వైరస్‌ గురించి వాస్తవాలు ఇలా ఏ విషయంలోనూ చైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని స్టిల్‌వెల్ ఆరోపించారు.

చైనాతో న్యాయమైన, నిర్మాణాత్మక, ఫలవంతమైన సంబంధాలను అమెరికా కోరుకుంటుందని, ఇది కేవలం మాటలకు మాత్రమే కాకుండా చర్యలను సూచిస్తుందని అన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రపంచాన్ని చైనా అప్రమత్తం చేసుంటే అనేక మంది ప్రాణాలు నిలబడేవని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలతో వారు చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా వాస్తవాలను వెల్లడించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.

గల్వాన్‌ లోయ వద్ద జరిగిన ఘర్షణలో భారత సైనికుల మరణం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.