యాప్నగరం

CoronaVirus: ముందే హెచ్చరించి.. అధికారుల వార్నింగ్‌తో సైలెంట్ అయిన చైనా డాక్టర్

చైనాలో కరోనా వైరస్ ఈ స్థాయిలో ప్రబలక ముందే ఓ డాక్టర్ సహచర డాక్టర్లను హెచ్చరించాడు. వైరస్ సోకకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించాడు. కానీ పోలీసులు, అధికారులు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.

Samayam Telugu 4 Feb 2020, 6:49 pm
జనవరి ప్రారంభంలో వుహాన్‌లో కరోనా వైరస్ ప్రబలుతోందని ఓ డాక్టర్ తోటి డాక్టర్లను హెచ్చరించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అలాంటి ప్రచారం చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. నెల రోజుల తర్వాత ఆ డాక్టర్ హీరోగా మారిపోయాడు. హాస్పిటల్ బెడ్ నుంచి ఆయన చేసిన పోస్టు ఆయన్ను హీరోగా మార్చేసింది. ‘హల్లో ఎవ్రీవన్.. నేను లీ వెన్‌లియాంగ్, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్లో ఆప్తాల్మాజిస్ట్‌గా పని చేస్తున్నాను’ అంటూ ఆయన పోస్టును ప్రారంభించారు.
Samayam Telugu wuhan doctor
Image Courtesy: Twitter


డిసెంబర్లో కరోనా వైరస్ ప్రబలడం మొదలు కాగా.. ఏడు కేసులను పరిశీలించిన డాక్టర్ లీ అది 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వైరస్‌‌గా భావించారు. వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ నుంచి ఈ కేసులు వెలుగు చూశాయని భావిస్తుండగా... పేషెంట్లను తన హాస్పిటల్లోని క్వారంటైన్‌లో ఉంచారు.

డిసెంబర్ 30న చాటింగ్ సందర్భంగా తన సహచర డాక్టర్లను లీ హెచ్చరించారు. ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పుడు ఇది కరోనా వైరస్ అని ఆయనకు తెలీదు. నాలుగు రోజుల తర్వాత పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆయన్ను కలిశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఇది తీవ్ర ఇబ్బందికరం అంటూ ఓ లెటర్ మీద సంతకం చేయించుకున్నారు.

నువ్వు ఇలాగే చేస్తే అక్రమ చర్యగా భావిస్తాం. కోర్టుకు ఈడుస్తామని డాక్టర్‌ లీని అధికారులు హెచ్చరించగా.. ఆయన లిఖిత పూర్వకంగా సమ్మతించారు. రూమర్లను వ్యాపింపజేస్తున్నారనే కారణంతో పోలీసులు విచారించిన 8 మందిలో డాక్టర్ లీ ఒకరు.

Read Also: వుహాన్‌లో ఇంత మంది భారత విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారా?

జనవరి చివర్లో లీ చైనా సోషల్ మీడియా విబో ద్వారా ఓ లెటర్ కాపీని పబ్లిష్ చేశారు. ఏం జరిగిందో అందులో వివరించారు. కరోనా వైరస్ ప్రబలిందని తెలియగానే స్థానిక అధికారులు ఆయనకు క్షమాపణలు చెప్పారు. కానీ అప్పటికే ఆలస్యమైంది.

జనవరి ఆరంభంలో వుహాన్ అధికారులు ఈ వైరస్ కేవలం ఇన్ఫెక్షన్ బారిన పడిన జంతువులను తాకడం ద్వారా వస్తుందని భావించారు. దీంతో డాక్టర్ల రక్షణ కోసం ఎలాంటి గైడెన్స్ ఇవ్వలేదు. పోలీసులను కలిసొచ్చాక.. డాక్టర్ లీ గ్లుకోమాతో బాధపడుతున్న ఓ మహిళకు చికిత్స అందించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని ఆయనకు తెలీదు. తర్వాత ఆయనకు దగ్గు మొదలైంది. జనవరి 10న ఆయనకు దగ్గు రాగా.. మరుసటి రోజే జ్వరం వచ్చింది. రెండ్రోజులపాటు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఆయన పేషెంట్లు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వీరిని హాస్పిటల్‌కు తరలించారు.

Read Also: నాన్న కరోనా చికత్స కేంద్రంలో.. ఆకలికి తాళలేక కొడుకు మృతి

జనవరి 20న చైనా ప్రభుత్వం కరోనాను అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. డాక్టర్ లీకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. చాలాసార్లు నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. జనవరి 30న నిర్వహించిన న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలో కరోనా పాజిటివ్ అని వచ్చింది. అనంతరం ఆయన విబోలో తన స్టోరీ రాసుకొచ్చారు. భవిష్యత్తులో డాక్టర్లు అంటు వ్యాధుల గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి భయపడతారు అని డాక్టర్ లీ పోస్టు చదివిన ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Read Also: కరోనా ఎఫెక్ట్.. ఓడలో బందీగా 3500 మంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.