యాప్నగరం

భారత్‌ను కవ్విస్తూ.. పాక్‌ తీరానికి చైనా యుద్ధ నౌకలు

పాకిస్థాన్‌తో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న చైనా.. మరోసారి భారత్‌ను కవ్వించింది. మన దాయాది దేశానికి మూడు యుద్ధ నౌకలను పంపి..

TNN 11 Jun 2017, 4:49 pm
పాకిస్థాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న చైనా.. ఇటీవలే ఆ దేశానికి మూడు యుద్ధ నౌకలను పంపింది. భారత్‌కు పక్కలో బల్లెంలా మారిన దాయాది దేశాన్ని అడుగడుగున్న ప్రోత్సహిస్తోన్న డ్రాగన్ దేశం.. నాలుగు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కోసం శనివారం తమ యుద్ధ నౌకల్ని పాక్ తీరాలకు పంపింది. ఈ విషయాన్ని చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జిన్హువా వెల్లడించింది. ప్రస్తుతం ఈ నౌకలు కరాచీ రేవులో ఉన్నాయని చైనా మీడియా తెలిపింది.
Samayam Telugu chinese warships arrive on shores of all weather friend pakistan for training mission
భారత్‌ను కవ్విస్తూ.. పాక్‌ తీరానికి చైనా యుద్ధ నౌకలు


యుద్ధ నౌకలను పాక్ పంపడం పట్ల చైనా ఆర్మీ ప్లీట్ కమాండర్ షెన్ హవో స్పందించాడు. ఇరు దేశాల మధ్య అవగాహన పెంచడం, పరస్పర సహకారం, సంబంధాల బలోపేతం.. స్నేహబంధాన్ని మరింత పెంచడం కోసం ఇది ఉపకరిస్తుందన్నాడు. ప్రపంచ శాంతి కోసం, ఈ ప్రాంతంలో సుస్థిరత కోసం తమ మైత్రి ఉపయోగడపడుతుందని హావో ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇరుదేశాల ఉమ్మడి ప్రయోజనాల కోసం చైనా యుద్ధ నౌకల రాక ఉపకరిస్తుందని పాక్ నౌకాదళ అధికారులు వెల్లడించారు.

చైనాకు చెందిన చాంగ్ చున్, జింగ్ ఝౌ, చావో హు అనే మూడు యుద్ధ నౌకలు అరేబియా సముద్ర జలాల్లో పాక్‌తోపాటు సంయుక్త విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ యుద్ధ నౌకలు నాలుగు రోజులపాటు పాక్ ప్రాదేశిక జలాల్లో ఉండనున్నాయి. ఇటీవల భారత్‌తో కలిసి సంయుక్త విన్యాసాలు చేపట్టేందుకు ఆస్ట్రేలియా ముందుకు రాగా.. చైనాతో విబేధాలను పెంచుకోవద్దనే ఉద్దేశంతో భారత్ అందుకు నో చెప్పింది. కానీ చైనా మాత్రం ఇప్పుడు పాక్‌కు తమ యుద్ధ నౌకలను పంపి భారత్‌ను కవ్విస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.