యాప్నగరం

Hambantota Port చైనా నౌక హంబన్‌టోట‌కు రావడం వెనుక చక్రం తిప్పిన ఆ వ్యక్తి!

China Spy Ship రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్‌ తక్షణమే స్పందించి.. శ్రీలంకకు అభ్యంతరాలను తెలిపింది. దీనిపై లంక అధికారులు యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరారు. శ్రీలంక సూచన మేరకు నౌక రాక వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. కానీ, యువాన్‌ వాంగ్‌ హంబన్‌టొట దిశగా 1,000 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గతవారం గుర్తించారు. చివరకు చైనా బెదిరింపులకు లంక లొంగిపోయింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 16 Aug 2022, 6:30 pm

ప్రధానాంశాలు:

  • భారత్ మీదుగా లంకకు చైనా గూఢచర్య నౌక
  • నౌక పరిధిలోకి అణు స్థావరాలు, క్షిపణులు
  • చైనా ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక ప్రభుత్వం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చైనా గూఢచర్య నౌక
భారత్‌ విజ్ఞప్తులను బేఖాతరు చేస్తూ హంబన్‌టోట పోర్టులోకి (Hambantota Port) చైనా గూఢచారి నౌక యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5) ను శ్రీలంక అనుమతించింది. మంగళవారం ఉదయం 4.00 గంటల సమయంలో హంబన్‌టొట పోర్టుకు చైనా నౌక చేరినట్టు రేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు. అయితే, హంబన్‌టోటలో చైనా గూఢచర్య నౌక (China Spy Ship) అడుగుపెట్టడం వెనుక శ్రీలంక నౌకాదళ మాజీ అధిపతి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. సముద్ర సంబంధిత పరిశోధనల వంకతో చైనా ఈ నౌకను భారత్ సమీపంలోకి తీసుకొచ్చింది. యువాన్ వాంగ్ రాకను పసిగట్టిన భారత్.. ఈ నౌకను అనుమతించవద్దని పలుసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ శ్రీలంక పట్టించుకోలేదు.
తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో (Sri Lanka Crisis) కూరుకుపోయి చైనా నుంచి తీసుకున్న అప్పులను తీర్చలేక చేతులెత్తేసిన లంక.. హంబన్‌టోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రేవుకు చేరిన యువాన్ వాంగ్ 5 (Yuan Wang 5) ఆగస్టు 21 వరకు లంగరు వేస్తుంది. ఉపగ్రహ సమాచారంతో బాలిస్టిక్ క్షిపణులు, అణు స్థావరాలను గుర్తించే వ్యూహాత్మక నౌక ఇది. అయితే ఈ వాదనలను కొట్టిపారేస్తున్న చైనా.. ఇది మెరైన్ సైంటిఫిక్ రిసెర్చ్ నౌక అని చెబుతోంది.

వాస్తవానికి ఈ నౌక ఆగస్టు 11 నాటికి చేరుకుని.. 17 వరకు ఉంటుందని తొలుత ప్రకటించారు. అయితే, ఈ విషయంలో మరిన్ని చర్చలు అవసరమని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe)నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చెప్పింది. కానీ చివరకు చైనా ఒత్తిడికి తలొగ్గి.. నౌకను హంబన్‌టోటలోకి అనుమతించక తప్పలేదు. పీకల్లోతు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) రుణాలను అడ్డుకుంటామని చైనా బెదిరింపులకు దిగింది. దీంతో శ్రీలంక తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోక తప్పలేదు.

అయితే, దీని వెనుక పెద్ద కథే నడిచిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. చైనా నౌక రాకను విక్రమసింఘే ప్రభుత్వం వాయిదా వేయడంపై శ్రీలంక ప్రజా భద్రత మాజీ మంత్రి, నౌకాదళ మాజీ చీఫ్ రియర్ అడ్మిరల్ సరత్ వీరసేకర (Sarath Weerasekara) బహిరంగ విమర్శలకు దిగారు. దీనినిబట్టి శ్రీలంకలో చైనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

విక్రమసింఘే, ప్రధాన మంత్రి దినేశ్ గుణవర్దన (Dinesh Gunawardena), చైనా సన్నిహితుడు మహింద రాజపక్స (Mahinda Rajapaksa)లతో శరత్ వీరసేకర ఆగస్టు 8న లాబీయింగ్ చేశారు. దీంతో హంబంటోటా పోర్టుకు ఈ గూఢచర్య నౌకకు అనుమతి లభించింది.

శ్రీలంకలోని దౌత్యవేత్తల ప్రకారం.. పరిశోధనల సాకుతో హిందూ మహా సముద్ర ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తున్న చైనా గూఢచర్య నౌకల రాకపోకలు గత దశాబ్దంలో బాగా పెరిగాయి. ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసినా కనీసం మూడు నుంచి ఐదు గూఢచర్య నౌకలు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. 2020 నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలో 53 చైనా విశ్లేషణ నౌకలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి.. వీటి మూడు నుంచి 5 కంటే తక్కువ కాకుండా గూఢచర్య నౌకలు ఉన్నాయి.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.