యాప్నగరం

అసలైన స్నేహితుడికి అరుదైన గుర్తింపు.!

ఢాకాపై దాడి ఘటన సమయంలో భారతీయ స్నేహితురాలి కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన ఫరాజ్ హుస్సేన్ గుర్తున్నాడా?

TNN 25 Jul 2016, 5:18 pm
ఢాకాపై దాడి ఘటన సమయంలో భారతీయ స్నేహితురాలి కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టిన ఫరాజ్ హుస్సేన్ గుర్తున్నాడా? అమరుడైన ఆ బంగ్లాదేశ్ ముస్లిం విద్యార్థికి ట్యూనీషియా అరుదైన రీతిలో గౌరవించింది. ఆ దేశ రాజధాని నగరం ట్యూనిష్‌లో ఉన్న ‘గార్డెన్ ఆఫ్ ది రైటియస్ వరల్డ్ వైడ్ (గారివో)’లో అతడి కోసం ఓ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. నిష్కళంకమైన ముస్లింల కోసం ఇందులో చెట్లు, స్మారక స్థూపాలు ఏర్పాటు చేస్తారు. ఇటాలియన్ ఎంబసీలో ఉండే ఈ గారివోలో చోటు దక్కిన తొలి అరబ్ యేతర ముస్లిం ఫరాజ్ కావడం విశేషం. టెర్రరిజంపై అతడి పోరాటానికి గానూ ఈ గౌరవం లభించింది. ఇటలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయంతో గారివోను ఏర్పాటు చేశారు. ఫరాజ్‌తోపాటు సిరియాకు చెందిన ఆర్కియాలజిస్ట్ ఖలేద్ అల్ అసద్, మరో ముగ్గురు ట్యూనీషియన్లకు ఈ గార్డెన్‌లో చోటు దక్కింది. ఫరాజ్ త్యాగం విషయమై ఇటాలియన్ ఎంబసీకి అతడి తల్లి లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రకంగా ఫరాజ్ ప్రాణ త్యాగానికి స్వదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించినట్లైంది.
Samayam Telugu faraz honoured in tunisia
అసలైన స్నేహితుడికి అరుదైన గుర్తింపు.!

అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీ విద్యార్థి అయిన ఫరాజ్ భారతీయ స్నేహితురాలైన తరిషి జైన్, అబింతా కబీర్‌తో కలిసి ఢాకా కేఫ్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 20 ఏళ్ల ఫరాజ్‌కు అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ తన స్నేహితుల కోసం ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. స్నేహితుల కోసం తన ప్రాణాన్ని సైతం కాదనుకున్న ఈ గొప్ప మిత్రుడికి అరుదైన గుర్తింపు దక్కడం సబబే కదూ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.