యాప్నగరం

పాక్ ఎన్నికల్లో పోటీచేయనున్న ముంబై దాడుల సూత్రధారి!

ముంబై మారణహోమం సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ వచ్చే ఏడాది జరిగే పాక్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు.

TNN 3 Dec 2017, 3:13 pm
ముంబై మారణహోమం సూత్రధారి, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ వచ్చే ఏడాది జరిగే పాక్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. మిల్లీ ముస్లిం లీగ్ రాజకీయ పార్టీ తరఫున 2018 ఎన్నికల్లో పోటీచేయడం ఖాయమైంది. 2008 నవంబరు 26న ముంబై నగరంలోకి చొరబడిన ఉగ్రవాదులు మూడు రోజుల పాటు భయోత్పాతాన్ని సృష్టించారు. ఈ దాడులకు వ్యూహరచన చేసిన హఫీజ్ సయీద్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా అదే ఏడాది ప్రకటించింది. హఫీజ్‌పై చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికాల ఒత్తిడి చేయడంతో పాక్ ప్రభుత్వం గత జనవరి 21 న గృహనిర్బంధంలోకి తీసుకుంది. అయితే హఫీజ్ నేరాలకు పాల్పడినట్లు పాక్ ప్రభుత్వం ఆధారాలు సమర్పించలేదని, అతడి తక్షణమే విడుదల చేయాలంటూ లాహోర్ హైకోర్టు తీర్పునిచ్చింది.
Samayam Telugu hafiz saeeds jud to contest 2018 general elections in pakistan
పాక్ ఎన్నికల్లో పోటీచేయనున్న ముంబై దాడుల సూత్రధారి!


దీంతో హఫీజ్ సయీద్‌ను నవంబర్‌ 24న పాకిస్థాన్ విడుదల చేసింది. విడుదల అనంతరం తనను కలుసుకోడానికి వచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి హఫీజ్ మాట్లాడుతూ... కశ్మీర్‌పై తన పోరాటం ఆగదని, పాకిస్థాన్‌ను ఏకం చేసి భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించాడు. పనామా పేపర్లు కేసులో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను దోషిగా పేర్కొంటూ పాక్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. షరీఫ్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరిగిన ఉప-ఎన్నికలో ఆయన భార్య కుల్సూమ్ నవాజ్ పోటీచేశారు. ఆదే స్థానంలో మిల్లీ ముస్లిం లీగ్ తరఫున షైక్ యాకూబ్ కూడా పోటీ చేసి 6 వేలు ఓట్లు సాధించాడు. యాకూబ్‌ను భయంకరమైన తీవ్రవాదిగా 2012లోనే అమెరికా ప్రకటించింది.

గత ఆగస్టులో ప్రారంభమైన ఈ పార్టీ అధ్యక్షుడిగా సైపుల్లా ఖలీద్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 40 కంటే ఎక్కువ రాజకీయ, మత సంస్థలు ఒకే సంస్థగా ఏర్పడిన డిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షుడిగానూ హఫీజ్ కొనసాగుతున్నారు. మరోవైపు హఫీజ్ సయీద్‌ను విడుదల చేయడంపై భారత్, అమెరికాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర నేరాల కింద అతడిని అదుపులోకి తీసుకోకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.