యాప్నగరం

Pakistan Hindu Temple: పాక్‌లో భారీ వరదలు.. వందలాది మందికి ఆశ్రయం కల్పించిన హిందూ ఆలయం

Pakistan Hindu Temple: భారీ వరదలతో పాకిస్థాన్ ప్రజలు విలవిల్లాడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బలూచిస్థాన్‌లో వరదల బారిన పడిన ప్రజలను స్థానిక హిందూ ఆలయం అక్కున చేర్చుకుంది. వందలాది మందికి ఆశ్రయం కల్పించింది. మైక్ ద్వారా పిలిచి మరీ హిందువులు స్థానికులను ఆలయంలో ఆశ్రయం కల్పించారు. వారే వరద బాధితులకు ఆహారం కూడా అందించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి కుల మతాలు చూడొద్దని చాటి చెప్పారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 12 Sep 2022, 7:10 am

ప్రధానాంశాలు:

  • వరదలతో పాకిస్థాన్ విలవిల
  • హిందూ ఆలయంలో తలదాచుకున్న ప్రజలు
  • 300 మందికి ఆశ్రయం కల్పించిన మందిరం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pakistan Floods
పాకిస్థాన్ వరదలు
Pakistan Hindu Temple: భారీ వర్షాలు, వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. దేశంలోని మూడో వంతు భూభాగం ముంపునకు గురైంది. వరదల కారణంగా దాదాపు 1400 మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది జనం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పంటలు దెబ్బతినడంతోపాటు 3 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఎత్తయిన ప్రదేశాల్లో వీరంతా ఆశ్రయం పొందుతున్నారు. కాగా బలూచిస్థాన్‌లోని ఓ చిన్న గ్రామంలో ఉన్న హిందూ ఆలయం వరదల బారిన పడిన 200-300 మంది ప్రజలకు ఆహారం, ఆశ్రయం కల్పించింది. ఈ ఆలయంలో ఆశ్రయం పొందుతున్న వారిలో చాలా వరకు ముస్లింలే ఉండటం గమనార్హం.
బలూచిస్థాన్‌లోని కచ్చి జిల్లాలో జలాల్ ఖాన్ అనే గ్రామం ఉంది. నార్ని, బోలాన్, లేహ్రీ నదులు ఉప్పొంగి ఈ ఊరిని ముంచెత్తాయి. బాహ్య ప్రపంచంతో ఈ గ్రామానికి సంబంధాలు తెగిపోవడంతో.. ప్రభుత్వం హెలికాఫ్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లను జారవిడిచేది. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. దీంతో ఊళ్లో ఉన్న హిందువులు వరద బాధితులకు ఆశ్రయం కల్పించడం కోసం స్థానిక బాబా మధోదాస్ మందిరం తలుపులు తెరిచారు.

జనం వరదల కారణంగా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన హిందువులు.. ఆలయంలోకి వచ్చి తలదాచుకోండని గుళ్లోని లౌడ్ స్పీకర్ల ద్వారా కోరారు. దీంతో స్థానికులు తమ మేకలు, గొర్రెలను తీసుకొని వెళ్లి ఈ ఆలయంలో తలదాచుకుంటున్నారు. వీరిలో చాలా మంది ముస్లింలే. వారందరికీ అక్కడి హిందువులే భోజనం ఏర్పా్ట్లు కూడా చేశారు.

బాబా మధోదాస్ అనే వ్యక్తి ఓ సాధువు. దేశం విడిపోవడానికి ముందు ఈ ప్రాంతంలో ఆయన జీవించారు. ఒంటె మీద తిరుగుతూ ఉండేవారు. ఆయన పట్ల హిందువులతోపాటు ముస్లింలు కూడా గౌరవంతో మెలిగేవారు. ఆయనకు ఇక్కడి హిందువులు ఎత్తయిన ప్రదేశంలో పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఏటా బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్స్‌ల నుంచి వందలాది మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. దీంతో వారికి వసతికి ఇబ్బంది లేకుండా వందలాది గదులను నిర్మించారు.

‘బాబా మధోదాస్ ఒంటె మీద ప్రయాణించేవారు.. ఆయన గురించి మా అమ్మానాన్న ఎన్నో విషయాలు చెప్పేవారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఆయన అందర్నీ మానవత్వంతో ఆదరించేవారని అమ్మానాన్న నాకు చెప్పారు’ అని ఇల్తాఫ్ బుజ్దార్ అనే వ్యక్తి తెలిపారు.

జలాల్ ఖాన్ గ్రామంలోని చాలా వరకు హిందూ కుటుంబాలు ఉపాధి కోసం కచ్చి లాంటి పట్టణాలకు వలస వెళ్లాయి. కానీ కొద్ది కుటుంబాలు మాత్రం ఆలయ బాగోగులు చూసుకుంటున్నాయి. భాగ్ నరీ తహసీల్‌‌లో ఓ దుకాణం నడిపే రత్తన్ కుమార్ (55) అనే వ్యక్తి ఈ ఆలయానికి ఇంఛార్జిగా ఉన్నారు. వరదల కారణంగా ఆలయంలోని కొన్ని గదులు దెబ్బతిన్నప్పటికీ.. మిగతా ఆలయం మొత్తం సురక్షితంగా ఉందని రత్తన్ కుమార్ కుమారుడు సవాన్ కుమార్ తెలిపారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.