యాప్నగరం

వాజ్‌పేయి మరణం.. తప్పులో కాలేసిన చైనా పత్రిక

అంతర్జాతీయ పత్రికలు వాజ్‌పేయి మరణం గురించి ప్రముఖంగా కథనాలు ప్రచురించాయి. కానీ చైనాకు చెందిన జిన్హువా మాత్రం ఆయన మరణ వార్తను ట్వీట్ చేసే సమయంలో పొరబాటు చేసింది.

Samayam Telugu 17 Aug 2018, 10:11 am
మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం పట్ల మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. ఆయనతో నేతల అనుబంధం, విలక్షణ వ్యక్తిత్వం.. అభివృద్ధి దిశగా ఆయన వేసిన బాటలు.. పొరుగు దేశాలతో సంబంధాలు.. పోఖ్రాన్ అణు పరీక్షలు.. ఇలా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను మీడియా మన కళ్ల ముందు ఉంచుతోంది. ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఉన్నతంగా నిలిపేందుకు ప్రయత్నించిన ఆయన మరణం పట్ల అంతర్జాతీయ మీడియా ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం..
Samayam Telugu vajpayee.jpg1



ది గార్డియన్:
గార్డియన్ పత్రిక వాజ్‌పేయిని మితవాద నాయకుడిగా అభివర్ణించింది. ఆయన చేపట్టిన పోఖ్రాన్ అణు పరీక్ష పాక్‌తో అణు యుద్ధ భయాలను రేకెత్తించిందని గుర్తు చేసింది. పొరుగు దేశానికి శాంతి హస్తం అందించారని తెలిపింది.

న్యూయార్క్ టైమ్స్:
పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించడం ద్వారా వాజ్‌పేయి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అదే సమయంలో పాక్‌తో ఉద్రిక్తతలను తగ్గించడానికి, అమెరికాతో బంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించారని తెలిపింది. హిందూ మెజార్టీ దేశమైన భారత్‌లో ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతరులకు సమాన హక్కుల కోసం ఆయన గళం విప్పారని కొనియాడింది.

వాషింగ్టన్ పోస్ట్:
భారత్‌ను న్యూక్లియర్ పవర్‌గా మలిచిన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 93వ ఏట మరణించారని ది వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. వాజ్‌పేయి హయాంలో నిర్వహించిన అణు పరీక్షలు భారత్‌ను అణు శక్తి దేశంగా మార్చాయని తెలిపింది. ఆయన బీజేపీని అధికారంలో తీసుకొని రావడమే కాదు.. ఇతర పార్టీతో సంకీర్ణాన్ని సమర్థవంతంగా నడిపారని కొనియాడింది.

డాన్ న్యూస్:
పాకిస్థాన్‌తో శాంతి ప్రక్రియకు శ్రీకారం చుట్టిన నేతగా మాజీ ప్రధాని వాజ్‌పేయిని పాక్‌కు చెందిన డాన్ పత్రిక అభివర్ణించింది. పోఖ్రాన్‌లో చేపట్టిన అణుపరీక్షలు భారత్, పాక్ మధ్య అణు యుద్ధం ఆందోళనలకు కారణమయ్యాయని తెలిపింది. అవినీతి ఊబిలో చిక్కుకోకుండా.. రాజకీయాలను నడిపిన అరుదైన భారత నేతగా వాజ్‌పేయిని అభివర్ణించింది.
అంతర్జాతీయ పత్రికలు వాజ్‌పేయి మరణం గురించి ఇలా కథనాలు ప్రచురించాయి. కానీ చైనాకు చెందిన జిన్హువా మాత్రం ఆయన మరణ వార్తను ట్వీట్ చేసే సమయంలో పొరబాటు చేసింది. వాజ్‌పేయి ఫొటోకు బదులు జార్జ్ ఫెర్నాండెజ్ ఫొటోను ట్వీట్ చేసింది. దీంతో చైనా పత్రిక వైఖరిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిన్ పింగ్ బదులు జాకీ చాన్ ఫొటో ఉంచి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.